Telangana Registrations and Stamps Department | తెలంగాణలో సమర్థవంతంగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే బాధ లేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నామని ప్రకటించారు.
ప్రయోగాత్మకంగా ఈ కార్యాలయంలోనే..
స్లాట్ బుకింగ్ విధానాన్ని మొత్తం 22 చోట్ల ప్రయోగాత్మకంగా ఈనెల 10 నుంచి ప్రారంభిస్తున్నారు. అవి.. హైదరాబాద్లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం (ఆర్ఓ), మేడ్చల్ (ఆర్ఓ ), మహబూబ్ నగర్(ఆర్ఓ), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్.
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించారు. ప్రజలు నేరుగా “registration.telangana.gov.in” వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చు.
స్లాట్ బుక్ చేసుకోనివారికోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. లేదా నేరుగా కార్యాలయానికి చ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనవాస్ రెడ్డి తెలిపారు.
Registrations Office : అదనపు సిబ్బంది నియామకం
నిత్యం రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (Registrations Office) స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సులభతరం చేయడానికి అలాగే 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమించనున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సిబ్భందిని నియమించారు. దీనివలన కుత్బుల్లాపూర్ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) కార్యాలయాలను రీ ఆర్గనైజేషన్ చేస్తున్నామని, ఇందులో భాగంగా అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విధానాన్ని ముందుగా రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట – సరూర్ నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేశామని మంత్రి తెలిపారు.
రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్ సైట్ లో ఒక మాడ్యూల్ ని ప్రవేశపెట్టామని మొదటగా సేల్ డీడ్ దస్తావేజుల కోసమే ఈ సౌకర్యం ఉంటుందని ఇది కూడా ఐచ్చికమేనని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజు పైన అమ్మినవాళ్ళు, కొన్నవాళ్లు, సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా/భౌతికంగా సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వలన దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. దీని వలన ప్రజల సమయం వృధా అవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఇ-సంతకం ప్రవేశపెడుతున్నామని ఈనెల చివరిలోగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








