తాను భారతీయ జనతా పార్టీని వీడి పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్నది కేవలం “పిచ్చి ప్రచారం” అని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు
నేను, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పార్టీ మారుతున్నామన్న వార్తలు అవాస్తవమని ఈటల స్పష్టం చేశారు. “పార్టీ మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని నేను. పదవుల కోసం పద్దులు మోసే అలవాటు నాకు లేదు” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోని కొందరు వ్యక్తులే ఇటువంటి దుష్ప్రచారానికి ఊతమిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఆనాడు వినేవారే లేరు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను పార్టీ నుంచి బయటకు నెట్టి ఐదేళ్లు కావస్తోందని ఈటల గుర్తు చేసుకున్నారు. “ఆనాడు నా గోడు వెళ్లబోసుకుందామన్నా ఎవరూ వినలేని పరిస్థితి నెలకొంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొని బయటకు వచ్చాను” అని పాత విషయాలను ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత
రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత మొదలైందని ఈటల విమర్శించారు. ముఖ్యంగా హైడ్రా (HYDRAA) పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. జవహర్నగర్ డంపింగ్యార్డు సమస్యపై బాధితుల తరపున సుప్రీంకోర్టులో కేసు వేస్తామని ఆయన వెల్లడించారు.
GHMC ఎన్నికలపై కసరత్తు
వచ్చే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేస్తున్నట్లు ఈటల తెలిపారు. ఈ విషయంపై పార్టీ నేతలు రఘునందన్రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో చర్చిస్తున్నానని.. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.








