వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal Police Commissionerate) పరిధిలో నేరాల నియంత్రణపై కఠిన వైఖరి అవలంబించనున్నట్లు పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు అయిన యువత గంజాయి మత్తుకు బానిసలవకుండా, గంజాయి సరఫరా చేస్తున్న మూలాలను గుర్తించి నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
శనివారం కాకతీయ మెడికల్ కళాశాలలో( Kakatiya Medical College)లో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో కమిషనర్ పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, పెండింగ్ వారెంట్ల అమలు, అధికారుల పనితీరు వంటి అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. ప్రతి కేసులో వేగం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.
గంజాయి సరఫరాదారులపై ప్రత్యేక దృష్టి
గంజాయి వినియోగదారులను పట్టుకోవడం మాత్రమే కాకుండా, సరఫరా చేస్తున్న ప్రధాన నెట్వర్క్ను ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మూలాలపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచడం పోలీసుల సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో పేకాట రాయుళ్లపై కఠినంగా వ్యవహరించాలని, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవాలని, అధిక చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రత్యేకంగా ఎం.జి.ఎం, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాలను జియో ట్యాగింగ్కు అనుసంధానం చేసి సమర్థవంతంగా వినియోగించాలని స్టేషన్ అధికారులకు సూచించారు.
అక్రమ రవాణాపై ఉక్కుపాదం
అక్రమ ఇసుక రవాణా, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్టేషన్ హౌస్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, కవిత, శుభం నాగ్తో పాటు అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.







