●బయటపడితే పదుల సంఖ్యలో అధికారులు అవుట్!
● ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు.. తలలు పట్టుకున్న తహశీల్దార్ లు
●తమ పేర్లు ఎక్కడ బయటకొస్తాయోనని టెన్షన్ లో అధికారులు
ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. ఆ పేరే “శేఖర్”. వ్యవస్థను తన కబంధ హస్తాల్లో ఉంచుకుని, చట్టాన్ని చుట్టంలా మార్చుకున్న ఈ ‘బారాణ బ్రోకర్’ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడుతోంది. శేఖరుడి వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తాలెవరివి? రెవెన్యూ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఈ చక్రవర్తి కథాకమీమామిషు ఏంటి?
బ్యాంకు లావాదేవీలు బయటపడితే.. వికెట్లు పడాల్సిందే!
శేఖరుడి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై నిఘా పెడితే సంచలన నిజాలు బయటకు వస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా తహశీల్దార్ ల బినామీలకు, కొంత మంది రెవెన్యూ ఉద్యోగులకు ఈ దళారీ అకౌంట్ ల నుండి భారీగానే ట్రాన్సక్షన్ లు జరిగినట్లు తెలుస్తోంది.
పదుల సంఖ్యలో రెవెన్యూ అధికారులు శేఖర్తో నిరంతరం టచ్లో ఉన్నట్లు సమాచారం.
డిజిటల్ సాక్ష్యాలు: గడిచిన కొన్ని సంవత్సరాల్లో జరిగిన భారీ నగదు బదిలీలు, ఆన్లైన్ పేమెంట్స్ గమనిస్తే.. జిల్లాలోని పలువురు తహశీల్దార్లు, మరికొంత మంది రెవెన్యూ ఉద్యోగుల బండారం బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రక్షాళన తప్పదా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెవెన్యూ శాఖలో తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న రెవెన్యూ దళారీ శేఖరుడిపై పై ఏసీబీ, టాస్క్ ఫోర్స్ అధికారులు విచారణ గనుక లోతుగా చేపడితే, పదుల సంఖ్యలో అధికారులు తమ పదవులను కోల్పోవడమే కాకుండా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇల్లును తనిఖీ చేస్తే అధికారులు సైతం విస్తుపోవాల్సిందే..
సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా చలామణి అవుతున్న శేఖరుడు బాగానే వెనకేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
”ఏసీబీ లేదా టాస్క్ ఫోర్స్ అధికారులు గనుక సదరు వ్యక్తి నివాసంలో సోదాలు నిర్వహిస్తే.. అక్కడ లభించే రెవెన్యూ కు సంబంధించిన డాక్యుమెంట్లు, వివిధ రకాల భూముల పత్రాలు చూసి అధికారులే విస్తుపోవాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రచారం జరగడం గమనార్హం.”
ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు.. తలలు పట్టుకున్న తహశీల్దార్ లు!
గురువారం “సర్కార్ లైవ్ “లో వెలువడిన “రెవెన్యూ రాజ్యాంగం.. శేఖర్ కబంధ హస్తం” కథనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కథనం బయటకు రాగానే ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది కలెక్టరేట్ స్థాయి అధికారులు ఈ కథనం పై అంతర్గతంగా చర్చించుకున్నట్లు సమాచారం.
భయం గుప్పిట్లో తహశీల్దార్ లు: శేఖర్తో అంటకాగిన పలువురు రెవెన్యూ ఉన్నతాధికారులు,తహశీల్దార్ లు,ఉద్యోగులు ఇప్పుడు తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని తలలు పట్టుకుంటున్నారు. ఫోన్ కాల్స్ ఎత్తడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
కథనాలను ఆపేందుకు ‘బారాణ బ్రోకర్’ పాట్లు!
నిజాలు నిప్పులా బయటకు వస్తుండటంతో, శేఖర్ తనకున్న పలుకుబడిని ఉపయోగించి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో ఆఫర్లు ఇస్తూ, కథనాలను నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.
ప్రజల డిమాండ్..
కేవలం కింది స్థాయి సిబ్బందిని కాకుండా, ఈ అవినీతి సామ్రాజ్యానికి మూలస్తంభంగా ఉన్న శేఖర్ వంటి వ్యక్తులపై ఏసీబీ (ACB) మరియు టాస్క్ ఫోర్స్ తక్షణమే దృష్టి సారించాలని,అతని బ్యాంకు లావాదేవీలు, ఆన్లైన్ ట్రాన్సక్షన్ లపై ఆరాతీయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.ఉమ్మడి వరంగల్ లోని రెవెన్యూ శాఖలో అవినీతి ప్రక్షాళన జరగాలంటే శేఖరుడిని కట్టడి చేస్తే అవినీతి ప్రక్షాళన అయినట్లేనని కొంతమంది తహశీల్దార్ లు బాహాటంగానే చెప్తున్నారు.
పాఠకులకు గమనిక…
రెవెన్యూ దళారీ శేఖరుడు రెండు దశాబ్దాలుగా రెవెన్యూ వ్యవస్థను శాసిస్తున్నందున ఒకటి రెండు వార్తల్లో పూర్తి సమాచారాన్ని వెలువరించలేకపోతున్నాం. మరికొన్ని సంఘటనలు, తహశీల్దార్ ల తో కలిసి చేసిన అక్రమాలు మరికొన్ని కథనాల రూపంలో వెలువరిస్తాం.








