మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వికారాబాద్లో విషాదం నెలకొంది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాయిబాబా కాలనీకి చెందిన బసవరాజ్ హోంగార్డుగా పనిచేసి ఆరేళ్ల క్రితం మరణించాడు. అతడి మూడో కుమార్తె బలిజ దివ్య 2020వ బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. గత ఐదేళ్లుగా వికారాబాద్ జిల్లా ధారూర్ పోలీస్ స్టేషన్లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా బలిజ దివ్య మృతదేహం వద్ద ఒక సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రియమైన అమ్మ, నా కుటుంబసభ్యులు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నా చావుకు ఎవరు కారణం కాదు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఈ తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నా. అమ్మా.. నీకు నేను భారం కావొద్దని భావించా.. నాన్న ఉంటే బాగుండేది అమ్మ. నాన్న లేనందుకే నీకు ఇన్ని కష్టాలు. నన్ను క్షమించు అమ్మా.. అని అందులో రాసి ఉంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బలిజ దివ్య ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.







