Zomato : ఆహార డెలివరీ, క్విక్ కామర్స్లో అగ్రగామిగా ఉన్న జోమాటోకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) విభాగం నుంచి నోటీస్ అందింది. రూ. 803 కోట్ల ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని జీఎస్టీ విభాగం అందులో పేర్కొంది. థానేలోని సీజీఎస్టీ (CGST), సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ద్వారా ఈ నోటీస్ జారీ అయ్యింది. రూ. 401.7 కోట్ల GST డిమాండ్, అంతే మొత్తంలో వడ్డీ/జరిమానాతో కలిపి రూ. 803 కోట్లు జోమాటో (Zomato) చెల్లించాల్సి ఉందని వివరించింది.
‘ఈ ట్యాక్స్ డిమాండ్ నోటీసు డెలివరీ చార్జీలపై జీఎస్టీ చెల్లించలేకపోవడం కారణంగా జారీ అయ్యింది. మొత్తం రూ. 803 కోట్లలో రూ. 401.7 కోట్ల జీఎస్టీ డిమాండ్, అంతే మొత్తంలో వడ్డీ/జరిమానా ఉన్నాయి’ అని స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ వెల్లడించింది.
Zomatoకు ఇదేం కొత్తకాదు..
డెలివరీ చార్జీలపై రావాల్సిన ట్యాక్స్కు సంబంధించి జోమాటోకు జీఎస్టీ విభాగం నోటీసులు జారీ చేయడం ఇదేం కొత్తకాదు. గత ఏడాది రూ. 400 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చింది. ఈ ఏడాది జనవరి, జూన్ నెలల్లోనూ వరుసగా రూ. 4.2 కోట్లు, రూ. 9.45 కోట్లకు సంబంధించిన నోటీసులను జీఎస్టీ విభాగం నుంచి జోమాటో అందుకుంది.
డెలివరీ చార్జీలపై 18 శాతం జీఎస్టీ
జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ అండ్ క్విక్ కామర్స్ కంపెనీలు తమ సేవలపై డెలివరీ చార్జీలను వినియయోగదారుల నుంచి వసూలు చేస్తాయి. ఈ కంపెనీలు గిగ్ వర్కర్లను డెలివరీ పార్టనర్లుగా నియమించుకుంటాయి. ఆర్డర్ ప్రాతిపదికన వారికి చెల్లింపులు ఉంటాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఈ డెలివరీ చార్జీలు నేరుగా గిగ్ వర్కర్లకు చేరుతాయి. జీఎస్టీ చట్టాల ప్రకారం ఈ డెలివరీ చార్జీలను వసూలు చేయడం సేవల రుసుముగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో డెలివరీ చార్జీలపై 18 శాతం జీఎస్టీని నిర్దేశించారు.
లాభాల్లో అగ్రగామి Zomato
జొమాటో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్మెంట్ (QIP) ద్వారా ఈక్విటీ షేర్లను జారీ చేసి $1 బిలియన్ కంటే ఎక్కువ నిధులను సేకరించింది. శుక్రవారం జొమాటో స్టాక్ ఒక్కో షేరుకు రూ. 285 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. 2025 ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో జొమాటో మొత్తం ఆదాయంతో పోలిస్తే 68.5 శాతం పెరిగి రూ. 4,799 కోట్లకు చేరుకుంది, గత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ. 2,848 కోట్లు మాత్రమే. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 4.8 రెట్లు పెరిగి రూ. 176 కోట్లకు చేరింది.
ఫుడీడే ప్రారంభమై..
జొమాటో భారతదేశానికి చెందిన ప్రముఖ ఆహార పంపిణీ, క్విక్ కామర్స్ సంస్థ. 2008లో దీపిందర్ గోయల్, పంకజ్ చడ్డా సంయుక్తంగా స్థాపించిన కంనెనీ ఇది. తొలుత Foodiebay గా ప్రారంభమైంది. అనంతరం జొమాటోగా పేరు మార్చుకొని ప్రపంచవ్యాప్తంగా సేవలను విస్తరించుకుంది.
జొమాటో వినియోగదారులకు రెస్టారెంట్ల ఎంపిక, ఆహార ఆర్డర్లు, డెలివరీ సేవలతో పాటు రెస్టారెంట్ రేటింగ్స్, రివ్యూలు, ఆఫర్లు వంటి అనేక సేవలను అందిస్తోంది. ప్రస్తుత జొమాటో అనేక దేశాలలో తన సేవలను విస్తరించింది. భారతదేశంలో దీని ప్రధాన పోటీదారు స్విగ్గీ.
జొమాటో గిగ్ వర్కర్లను డెలివరీ పార్టనర్లుగా నియమిస్తూ వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందిస్తోంది. 2021లో జొమాటో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి, రూ. 9,375 కోట్ల IPO ద్వారా నిధులు సేకరించింది. జొమాటో తన వినూత్న సేవల ద్వారా ఆహార సరఫరా రంగంలో దూసుకెళ్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..