Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమంలో లబ్ధిదారులను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం సూచించారు. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థమంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
3 thoughts on “Indiramma Illu| ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం”