AAP vs Congress | ఇండియా కూటమిలోని కాంగ్రెస్ (Congress), ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య ఇప్పటికే కోల్ఢ్వార్ ఉండగా కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అగ్గి రాజేశాయి. దీనిపై ఆమ్ ఆమ్మీ నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ను కూటమి నుంచి తొలగించాలని INDIA భాగస్వామ్య పార్టీలను కోరుతామని ఆప్ నేతలు హెచ్చరించారు. రెండు పార్టీల మధ్య చోటుచేసకున్న ఈ రాజకీయ పరిణామాలు హాట్టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఇండియా కూటమిలో కలకలం రేపుతున్నాయి.
దుమారం రేపిన మాకెన్ వ్యాఖ్యలు
ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్పై ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ (Ajay Maken) చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమికి తలనొప్పిగా మారాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారని, జన్ లోక్పాల్ ఏర్పాటు చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని మాకెన్ ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన కేజ్రీవాల్ నకిలీ ఉద్యమకారుడని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆయన దేశద్రోహి అని కూడా మాకెన్ ఆరోపించారు.
కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్న ఆప్
కేజ్రీవాల్ (Arvind Kejriwal) పై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ చేసిన ఆరోపణలపై ఆమ్ఆద్మీ పార్టీ నేతలు మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాకెన్ ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఒకే కూటమిలో ఉంటూ భాగస్వామ్య పార్టీపై ఇలా అక్కసు వెల్లగక్కిన కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని ఆప్ నేతలు ఆరోపించారు. మాకెన్పై కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆ పార్టీని కాంగ్రెస్ను కూటమి నుంచి తొలగించాలని INDIA భాగస్వామ్య పార్టీలను కోరతామని హెచ్చరించారు.
బీజేపీకి సహకరించేందుకే..
ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Delhi Chief Minister Atishi) మీడియాతో మాట్లాడుతూ అజయ్ మాకెన్ పూర్తిగా బీజేపీ (BJP) స్క్రిప్ట్ను అనుసరిస్తున్నారని, బీజేపీ డైరెక్షన్తోనే ఆప్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ను దేశద్రోహి అనడం అతి దారుణమని దుయ్యబట్టారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించి లాభం చేకూర్చడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ఏ బీజేపీ నేతనైనా దేశద్రోహిగా కాంగ్రెస్ ప్రకటించలేదు. కానీ, ఆప్ నాయకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే వారి దురుద్దేశాన్ని సూచిస్తోంది అన్నారు.
AAP vs Congress : ఇక కలిసి ఉండలేం..
సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో కూటమి కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కష్టసాధ్యమని అన్నారు. చండీగఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కేజ్రీవాల్ ప్రచారం చేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో సహకరించకపోగా AAP నాయకులపై కేసులు పెట్టడంలో వెనుకాడటం లేదు అని ఆయన విమర్శించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్తో పొత్తుకు ఆప్ ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీ స్పందించలేదని సంజయ్ సింగ్ తెలిపారు.
24 గంటల అల్టిమేటం
అజయ్ మాకెన్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్కు సంజయ్ సింగ్ 24 గంటల గడువు ఇచ్చారు. అలా చేయకపోతే INDIA భాగస్వామ్య పార్టీలతో చర్చించి కాంగ్రెస్ను కూటమి నుంచి తొలగించాలని కోరతామని హెచ్చరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారేలా లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామాలు INDIA కూటమి ఐక్యతకు పెను సవాల్గా మారాయణణ భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..