Revisions to Engineering syllabus : తెలంగాణలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్య ఉండాలంటోంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) . అందుకు సిలబస్లో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంటోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇది దోహపడుతుందని భావిస్తోంది. ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సును నవీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనల ప్రకారం కమిటీ సిఫార్సులు చేసింది.
Engineering Education పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ పోటీకి సిద్ధంగా ఉండేలా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సిలబస్లో మార్పులు అవసరమని తెలిపారు. ప్రత్యేకంగా నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్ (ML), డేటా సైన్స్ (DS), సైబర్ సెక్యూరిటీ (CS) వంటి కొత్త రంగాలు ఇంజనీరింగ్ విద్యలో భాగం కావాలని అభిప్రాయపడ్డారు. సిలబస్ నవీకరణ కమిటీ చైర్మన్, TGCHE కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ మాట్లాడుతూ సిలబస్ మార్పులు AICTE మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని, క్రెడిట్ సిస్టమ్ను సమతుల్యం చేసుకుంటూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మార్పులు చేయాలని అన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థి తన 6వ లేదా 7వ సెమిస్టర్ నాటికి 160 క్రెడిట్లను పూర్తిచేసుకోవడానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని టీజీసీహెచ్ఈ (Telangana State Council of Higher Education) భావిస్తోంది.
దీంతో చివరి సెమిస్టర్ను పరిశ్రమ ఇంటర్న్షిప్ లేదా ప్రాజెక్టుల కోసం వినియోగించుకునేలా చూడాలని అంటోంది.
Revisions to Engineering syllabus : ప్రతిపాదనలు ఇవే..
తెలంగాణ ఇంజనీరింగ్ విద్య (Engineering Education) ను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు TGCHE ప్రతిపాదనలు ఇవే..
- యూనిఫాం క్రెడిట్ ఫ్రేమ్వర్క్: ప్రతి సెమిస్టర్కు 20 క్రెడిట్లు, మొత్తం నాలుగేళ్లలో 160 క్రెడిట్లు. మైనర్ లేదా ఆన్రస్ ప్రోగ్రామ్ల కోసం అదనంగా 20 క్రెడిట్లు. 2. మూల రంగాల బలోపేతం: సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు, AI, ML, DS, CS వంటి కోర్సులను కోర్ సబ్జెక్టుల్లో కలిపే ప్రణాళిక.
- ఇండస్ట్రీ ఇంటర్న్షిప్లు : రెండో, మూడో సంవత్సరం ముగిసిన తర్వాత, రెండుసార్లు తప్పనిసరిగా పరిశ్రమలకు చెందిన ప్రాజెక్ట్-ఆధారిత ఇంటర్న్షిప్లు చేయాలి.
- క్రెడిట్ ఫ్లెక్సిబిలిటీ : వేగంగా నేర్చుకునే విద్యార్థులు 6 లేదా 7వ సెమిస్టర్ నాటికి 160 క్రెడిట్లు పూర్తిచేసుకుని, చివరి సెమిస్టర్ను పూర్తిగా పరిశ్రమలో ఇంటర్న్షిప్ లేదా ప్రాజెక్టులకు కేటాయించేందుకు అవకాశం కల్పించాలి.
- క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీ : విద్యార్థులు నాస్కామ్ (NASSCOM) వంటి సంస్థల సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా క్రెడిట్లు సంపాదించడానికి అనుమతించాలి. కనీసం నాలుగు పరిశ్రమల విజిట్లు తప్పనిసరి చేయాలి.
- ఫ్యాకల్టీ & స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్: పరిశ్రమలో అనుభవజ్ఞులైన ప్రాసెర్ ఆఫ్ ప్రాక్టీస్లను బోధన కోసం తీసుకోవాలి. అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ, ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలి.
New Engineering syllabus : విద్యార్థులకు ప్రయోజనాలు
సిలబస్ మార్పుల వల్ల విద్యార్థులు కేవలం సర్టిఫికేట్ కోసం చదవకుండా, వాస్తవ ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా తన నైపుణ్యాలను మెరుగుపరచుకునే అవకాశాన్ని పొందుతారని అంటోంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE). తెలంగాణ రాష్ట్రం పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు అవసరమని భావిస్తోంది. ఇంజనీరింగ్ విద్య సిలబస్లో మార్పులు జరిగితే విద్యార్థులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటోంది. ముఖ్యంగా చదువు పూర్తయ్యే నాటికి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్కిల్సెట్ ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. పరిశ్రమలో అనుభవం పొందే అవకాశం కల్పించడం వల్ల విద్యార్థులు సిద్ధంగా ఉంటారని అంటోంది. అంతేకాకుండా పరిశ్రమలో పనిచేయడానికి అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పొందగలుగుతారని అభిప్రాయపడుతోంది.
పరిశ్రమలకు కూడా అనుకూలమే..
సిలబస్ నవీకరణ వల్ల పరిశ్రమలకు కూడా ప్రయోజనాలుంటాయి. ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు, పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ ఉన్న విద్యార్థులను ఎంచుకోవడానికి వీలుంటుంది. ఇదివరకు విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మరిన్ని కోర్సులు నేర్చుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు కోర్సు చదివే సమయంలోనే అలా నేర్చుకునేలా మార్పులు చేస్తే, పరిశ్రమలకు రాబోయే కాలంలో మంచి నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు అందుబాటులో ఉంటారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..