AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే మెగా డీఎస్సీని ప్రకటించి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వెల్లడించారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో బడ్జెట్ పద్దులపై మంత్రి లోకేష్ చర్చించారు. మెగా డీఎస్సీ (AP mega DSC) ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.3,000 కోట్లు అవసరమని తెలిపారు. ఈ పనులను మనబడి మనభవిష్యత్తు, ఉపాధి హామీ పథకాల కింద దశలవారీగా చేపడతామని చెప్పారు.
బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభమైంది. కేటాయింపులు, సంక్షేమ నిధుల అంశాలపై సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. సభ ముందుకు మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను మంత్రి నారాయణ, అలాగే, ఏపీ ఫిల్మ్ అండ్ టెలివిజన్పై వార్షిక నివేదికను మంత్రి కందుల దుర్గేష్ సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. త్వరలోనే డీఎస్పీని ప్రకటించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
జీవో 117పై మంత్రి ఏమన్నారంటే..
గత ప్రభుత్వం (Andhra pradesh government) 117 జీవో ద్వారా నిరుపేదలకు విద్యను దూరం చేసిందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. గత జగన్ సర్కారు నిర్వాహకంతో ప్రభుత్వ పాఠశాల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయంపై సభ్యులతో చర్చించాలని నిర్ణయించామని, మధ్యాహ్నం ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పూర్తి కాలేని పనులను పూర్తి చేస్తామని చెప్పారు. 117 జీవోకు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చే జీవో ఆధారంగా సభ్యుల సలహాలతో ముందుకు వెళ్తామని అన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 80 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
పాఠశాలల్లో సీసీ టీవీలు
పాఠశాలల వద్ద సీసీ టీవీల ఏర్పాటు, విద్యుద్ధీకరణ పనులు చేపడతామని మంత్రి లోకేష్ తెలిపారు. లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఆఫ్ ఏపీ కింద సీఎస్ఆర్ నిధులు తెచ్చి అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎస్ఆర్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారని, మనం కూడా అలా చేయాలని సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..