CM Revanth Reddy On Assembly | తెలంగాణలో ప్రస్తుతం అసలు జర్నలిస్టు (Journalist) ఎవరో.. కొసరు జర్నలిస్టు ఎవరో తెలియడంలేదని, ఎవరుపడితే వారు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారు. ఏది పడితే అది రాసేస్తున్నారు.. మాట్లాడుతున్నారు. జర్నలిస్టులంటే ఎవరు అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల ఓ అసభ్యకరమైన వీడియో.. అందులో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని దారుణంగా దూషిస్తూ, పోలీసు రక్షణ లేకపోతే ఆయనను చంపేస్తానని ఎవరో ఓ వ్యక్తితో తిట్టించిన వీడియోను కొన్ని సోషల్ మీడియా (social media)లో పోస్టు చేశారు. దీంతో వాటిపై కేసులు పెట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే వారు జర్నలిస్టులని.. జర్నలిస్టులను ఎందుకు అరెస్టు చేశారని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా రేవంత్ అసెంబ్లీ (Telangana Assembly) లో ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా నకిలీ జర్నలిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy బట్టలూడదీసి కొడతాం..
“ఎవరు జర్నలిస్టులు? ఎవరు నకిలీ? జర్నలిస్ట్ సంఘాలను లిస్ట్ తీసుకురండి.. ఆ లిస్ట్ లో లేని వాళ్ళు క్రిమినల్స్. ముసుగులేసుకుని వాళ్ళు రాసే రాతలను చూసి విశ్లేషిద్దామని అన్నారు. బొడ్కల్ తీసి బట్టలు వూడదీసి ఉరికించి కొడతామన్నారు. కుర్చీలో వున్నా, ఏం చేయలేడని అనుకోవద్దు.. నేను ముఖ్యమంత్రిని.. స్పీకర్ అనుమతిస్తే ఒక రోజు జర్నలిస్ట్ లపై చర్చ చేద్దాం. చట్టం తీసుకొద్దాం. పరిధి దాటితే తడాఖా చూపిద్దాం. మీరు మనుషులేనా? మా ఇంట్లో ఆడబిడ్డలను తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? తోలు తీస్తాం”…. ఇదీ ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు ఎవరు జర్నలిస్టులు? ఎలా గుర్తిస్తారు? ప్రభుత్వ గుర్తింపు కార్డులు వున్న వాళ్లే జర్నలిస్టులా? అలా అయితే అందులో నిజంగా పని చేస్తున్న జర్నలిస్టులు సగం మంది కూడా ఉండరు. ప్రభుత్వమే ఎడాపెడా ఎవరికంటే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చేసింది. నిజంగా పని చేస్తున్న వాళ్లలో సగానికి పైగా గుర్తింపు కార్డులు ఉండవు. ఎలా గుర్తిస్తారు. ఎలా ఉరికించి కొడతారు?
జర్నలిస్టులు పలు రకాలుగా ఉన్నారు. వెటరన్ జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ఫ్రీ లాన్స్ జర్నలిస్టులు, ప్రింట్ మీడియా జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, స్టాఫ్ రిపోర్టర్లు, స్ట్రీంగర్లు, కంట్రిబ్యూటర్లు. వీళ్ళు కాకుండా సబ్ ఎడిటర్లు, డెస్క్ ఇంచార్జులు, న్యూస్ ఎడిటర్లు, కార్టునిస్టులు ఇంకా బోలెడు. ఆఖరికి ప్రూఫ్ రీడర్లు కూడా.. ఇక ప్రింటింగ్ మెషిన్ వర్కర్స్ నుంచి ఆఫీస్ అసిస్టెంట్ వరకు ప్రెస్ అని రాసుకుంటారు. వీళ్లందరిలో జర్నలిస్టులను ఎవరు ఎలా గుర్తిస్తారు.. అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
వీరంతా ఒకవైపు అయితే ఇక ట్యూబ్ పేరిట లక్షల మంది జర్నలిస్టులు పుట్టుకొచ్చారు. రెండేళ్లు ఎక్కడో ఏదో ఛానెల్ లో పనిచేసి బయటకొచ్చి సొంత యూట్యూబ్ పెట్టేసుకుంటారు. అనుభవం లేకున్నా, ఫోన్ ఉంటే చాలు జర్నలిస్ట్ అయిపోతున్నారు. వీళ్లందరిని ఏం చేయాలి? కొందరు రాజకీయ నాయకులే తయారు చేసిన జర్నలిస్టులు ఉన్నారు. వారు పెయిడ్ జర్నలిస్టులు. రేటు కట్టి మరీ రాస్తారు. వసూలు చేసి ఆహా ఓహో అంటూ రన్నింగ్ కామెంట్రీ ఇస్తారు. వీళ్ళు కూడా జర్నలిస్టులేనా? ఎవరి గొట్టం వారిదే.. అవసరం వచ్చినప్పుడు వాళ్ళను వాడుకునేది రాజకీయ నాయకులే.. ఇక ఏ పార్టీకి ఆ గొడుగు పట్టే జర్నలిస్టులు ఉన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డు పట్టుకుని దందాలు, బ్లాక్ మెయిల్ చేసే కేటు జర్నలిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరు బిల్డింగ్ కడుతున్నారో చూసి బెదిరించడం, ఏదో రాసేస్తాం, స్టోరీ ప్లే చేస్తాం, ఆ అనుమతులు లేవు అంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసే జర్నలిస్టులు ఉన్నారు. అంతే కాదు, వీళ్ళను మించి మరో కిలాడీ దందా, బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదొక రియల్ ఎస్టేట్ కంపెనీపై అవాకులు చెవాకులు రాసేసి, చివర్లో మిగతా భాగం రేపు అని రాసి బెదిరించి భయపెట్టి వసూలు చేసే జర్నలిస్టులు ఉన్నారు. ఇక సోషల్ మీడియా జర్నలిస్టులు.. ప్రతి పార్టీకి ఒకటి కాదు పది కాదు వందల్లో జర్నలిస్టులు పని చేస్తున్నారు. పెద్ద పెద్ద పత్రికల పేర్లు చెప్పి అడుక్కునే నకిలీ జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉంటాయి.
ఇలా అందరినీ పెంచి పెద్ద చేసింది రాజకీయ పార్టీలే.. ప్రెస్ మీట్ పెట్టాలంటే భయపడిపోతున్నారు. వందల మంది వచ్చి తాంబూళం ఇవ్వనిదే వెళ్ళరు. జీతాలు ఇవ్వకుండా కేవలం లోగో గొట్టాలు, ఐడి కార్డులు ఇచ్చి తరుముతున్న మీడియా యాజమాన్యాలది కూడా తప్పు. వాళ్ళను పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు, రాజకీయ ప్రతినిధులది తప్పు. మధ్యలో మీడియా సంఘాలు ఏం చేస్తాయి. వారి మాట ఎవరు వింటున్నారు? గుర్తింపు కార్డులు పొంది తిరుగుతూ పైరవీలు చేసుకుంటున్న జర్నలిస్టులు ఎవరో, అసలైన జర్నలిస్టులు ఎవరో లెక్కలు తీసి ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







