TTD darshan tickets : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సౌకర్యార్థం ప్రతినెలా వివిధ సేవల కోసం దర్శనం (Tirumala Tirupati Devasthanams) టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులను ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తోంది. ఈ క్రమంలో 2025 జూన్ నెలలో భక్తులకు అందుబాటులో ఉండే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, వసతి గదుల కోటాను విడుదల చేసింది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను ఈ రోజు (మార్చి 22న) మధ్యాహ్నం టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ సేవా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ను సందర్శించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇతర భక్తుల కోసం TTD darshan tickets
అదే విధంగా ఇతర భక్తుల కోసం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ (TTD) మార్చి 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. వీటితో పాటు అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకుంది. భక్తులు వీటి కోసం ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని, నిర్ణీత సమయానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచిస్తోంది. ఇదిలా ఉండగా మార్చి 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను కూడా టీటీడీ విడుదల చేసింది. అందువల్ల భక్తులు తమ యాత్ర ప్రణాళికను సకాలంలో సిద్ధం చేసుకుని, నిర్ణీత తేదీలకు ముందుగా వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవాలి.
TTD darshan tickets : భక్తులకు ముఖ్యమైన సూచనలు
- టికెట్లు బుక్ చేసుకునే సమయంలో అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించాలి.
- ఏజెంట్లు లేదా అనధికారిక వెబ్సైట్ల ద్వారా టికెట్లు పొందాలని ప్రయత్నించకూడదు.
- టీటీడీకి ఎలాంటి మూడో పార్టీ లేదా మిడిల్మెన్ లింకులు లేవు. కనుక, కేవలం అధికారిక వెబ్సైట్ను ఉపయోగించడం భక్తులకు మేలు.
గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి మరో ట్రస్టు :సీఎం చంద్రబాబు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ( Lord Venkateswara Swamy)ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ప్రసాద విభజన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించేందుకు ఒక నూతన ట్రస్ట్ను ఏర్పరచనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన విరాళాలను సేకరించేందుకు ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేయనున్నారు. ఆలయాలు లేని గ్రామాల్లో వీటిని నిర్మించడం ద్వారా భక్తులకు దైవ దర్శనం చేసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అన్నప్రాదం ట్రస్టుకు రూ. 2,200 కోట్ల విరాళం
శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటికే విరాళాల ద్వారా రూ. 2,200 కోట్లు చేరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ నిధులను భక్తుల సంక్షేమానికి ఉపయోగించడంతో పాటు, ఆలయాల నిర్మాణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు వెచ్ఛిస్తామని సీఎం తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..