Telangana News | జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ వరకు రాజీవ్ యువ వికాసం పథకం (Rajiv Yuva Vikasam Shceme ) కింద అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమాక్క సూచించారు. ఈమేరకు ఆయన రాజీవ్ యువ వికాసం స్కీమ్ పై ఉన్నతాధికారులతో సమీక్షించారు. దరఖాస్తుల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 6 నుంచి మూడు వారాల్లో మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు క్షుణ్ణంగా పరిశీలన చేయాలని ఆయన ఆదేశించారు.
Rajiv Yuva Vikasam : దరఖాస్తుల పరిశీలన ఇలా..
- దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ కు మండల అధికారులు పంపించాలి
- కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ వారం రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతి కోసం పంపించాలి.
- అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత లబ్ధిదారులను ప్రకటించాలి.
- జూన్ రెండు నాడు స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలను అందజేయాలి.
- జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు సంబంధించిన పత్రాలను నియోజకవర్గాల్లో పంపిణీ చేయాలి.
- ఆ తర్వాత లబ్ధిదారులకు వ్యాపారాల్లో మెలకువలకు సంబంధించిన నైపుణ్యం అందించడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి
- ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా మధ్య దళారీల పైరవీలు లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయాలి
9వేల కోట్ల పెట్టుబడులు
రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం బ్యాంకు మార్జిన్ తో కలిపి 9వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతోందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ డబ్బులతో యువత వారి కాళ్ళ మీద వారు నిలబడి తమకు నచ్చిన వ్యాపారంలో రాణించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ ఆలోచన విధానాన్ని 100 శాతం అమలు చేసే విధంగా అధికారుల పనితీరు ఉండాలని ఆయన సూచించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ శాఖలను సమన్వయం చేస్తూ ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి రాజీవ్ యువ వికాస్ మిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మిషన్ బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా శాఖల వారీగా ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించడానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
కాగా రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకం కింద లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. నిర్దేశించుకున్న కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో ఉంది శాతం అమలు కావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ఉన్నత అధికారులు ఈ శ్రీధర్, శరత్, శ్రీధర్, దివ్య దేవరాజన్, తఫ్సీర్ ఇక్బాల్ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








