Bhu bharathi | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి భూభారతి చట్టం (Bhu bharathi) లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత నెల 14న భూభారతి చట్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించుకున్నామని, అదేనెల 17 నుంచి 30 వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు (Revenue seminars) నిర్వహించామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆయా మండలాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జూన్ 2వ తేదీ నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
Bhu bharathi : అన్ని భూ సమస్యలను పరిష్కరిస్తాం..
రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులకు నిర్ధేశిత గడువు పెట్టుకొని భూ భారతి చట్టం పరిధిలోకి వొచ్చే ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రయోగాత్మకంగా నిర్వహించిన నాలుగు మండలాల్లో ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించడం జరిగిందని, ఈనెల 30 తేదీ నాటికి దాదాపు 60 శాతం భూసమస్యలను పరిష్కరిస్తామని భూభారతి చట్టానికి లోబడి పరిష్కరించవలసిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతూ , పరిష్కరించలేనివాటికి ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు తెలియజేస్తామని తెలిపారు.
సాదాబైనామాలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టులో స్టే వెకేట్ అయిన వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అయితే ఆన్ లైన్ లో ఉన్న దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి గత ఏడాదిన్నర కాలంగా రెవెన్యూ విభాగంలో చేపట్టిన సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.