AVM Saravanan | చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు ఏవీయం ప్రొడక్షన్స్ ప్రతిష్టను నిలబెట్టిన ప్రముఖ నిర్మాత, సంస్థ వ్యవస్థాపకుడు ఏ.వి. మేయప్ప చెట్టియార్ కుమారుడు ఏవీఎం శరవణన్ (AVM Saravanan) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలంగా చికిత్స అందుతోంది. అయితే, చికిత్స ఫలించక ఈ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.
పుట్టినరోజు మరుసటి రోజే..
ఏవీఎం శరవణన్ నిన్ననే (బుధవారం, డిసెంబర్ 3) తన 86వ పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం మృతి చెందడం సినీ ప్రముఖులను, అభిమానులను కలచివేసింది. 1945లో ఏ.వి. మేయప్ప చెట్టియార్ స్థాపించిన ఏవీయం ప్రొడక్షన్స్ (AVM Productions), సౌత్ ఇండియన్ సినిమా నిర్మాణంలో అగ్రగామిగా నిలిచింది. మేయప్ప చెట్టియార్ తరువాత సంస్థ బాధ్యతలు శరవణన్ చేపట్టారు. ఏవీయం స్టూడియో ప్రతిష్టను దశాబ్దాల పాటు శిఖరాగ్రాన నిలబెట్టారు.
ఆయన నాయకత్వంలోనే శివాజీ గణేశన్, ఎంజీఆర్, రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, విజయ్, అజిత్, సూర్య వంటి అగ్ర కథానాయకులతో అనేక బ్లాక్బస్టర్ చిత్రాలు నిర్మించబడ్డాయి. ఏవీయం బ్యానర్లో నటించడం ప్రతీ నటుడికి ఒక కలగా ఉండేది.
ఆదర్శనీయ వ్యక్తిత్వం
వ్యాపారంలో పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ, ఏవీఎం శరవణన్ వ్యక్తిగతంగా అందరితో ఆప్యాయంగా మెలిగేవారని, వినయం, నిబద్ధతతో కూడిన ఆయన పనితీరు ఎందరికో ఆదర్శమని సినీ ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. రజినీకాంత్ నుంచి కొత్త నటుల వరకు ప్రతి ఒక్కరూ ఆయనను అత్యంత గౌరవంగా చూసేవారు. ఏవీఎం శరవణన్ మృతి తమిళ చిత్ర పరిశ్రమకు ఒక యుగం ముగిసినట్లుగా భావిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







