పీఎల్జీఏ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు.. డీజీపీ ముందు సరెండర్!
హైదరాబాద్, జనవరి 2: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలక నేత, పీఎల్జీఏ (పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ) చీఫ్ బర్సే దేవా శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు (Maoist Surrender) . పార్టీ బలహీనపడటం, ఆరోగ్య సమస్యలు మరియు ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆయన జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు.
ఎవరీ బర్సే దేవా?
బర్సే దేవా మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుడు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత, పార్టీ సాయుధ బలగాల బాధ్యతలను దేవానే చూస్తున్నారు. వీళ్లిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం. పార్టీకి ఆయుధాల సరఫరా చేయడంలో మరియు దాడుల వ్యూహరచనలో దేవాది కీలక పాత్ర పోషించాడు. లొంగిపోయిన సమయంలో దేవా వద్ద ఉన్న అత్యాధునిక ‘మౌంటెన్ ఎల్ఎంజీ’ (Light Machine Gun) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరికొందరు సభ్యుల సరెండర్
దేవాతో పాటు మరికొందరు మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. గడిచిన ఏడాది కాలంగా పార్టీలో ముఖ్య నేతల మరణాలు, వందలాది మంది కేడర్ లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ అస్తిత్వ పోరాటం చేస్తోంది. బర్సే దేవా లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో వివరించనున్నారు. దేవా లొంగుబాటు వెనుక ఉన్న కారణాలు, పార్టీలోని ప్రస్తుత పరిస్థితులపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







