- పైడిపల్లి రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 704 లోని రోడ్డునే మింగేసిన రియల్ మాఫియా..
- రెవెన్యూ, మున్సిపల్ అధికారుల కళ్ళు ‘మూయించారా’..?
- ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ – కొత్తపేట మార్గంలో 10 ఎకరాల్లో 81 ప్లాట్ల తో వెంచర్
Warangal Paidipalli Land Encroachment రియల్ ఎస్టేట్ మాఫియా ఆకలికి హద్దు అదుపు లేకుండా పోతోంది. భూమి కనిపిస్తే చాలు ‘నాది’ అని బోర్డు పెట్టేసే అక్రమార్కులు, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ దారినే మింగేస్తున్నారు. పైడిపల్లి రెవెన్యూ శివారులో వెలిసిన ఒక వెంచర్ నిర్వాహకుల బరితెగింపు ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. సర్వే నంబర్ 704లో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న రోడ్డును సైతం ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నా, అటు రెవెన్యూ.. ఇటు మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ – కొత్తపేట మార్గంలో భూదందా!
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 3 వ డివిజన్ పైడిపల్లి రెవెన్యూ శివారులోని ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ నుండి కొత్తపేట వెళ్లే మార్గంలో ఇటీవల సర్వే నెంబర్ 704,721 లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 81 ప్లాట్లతో వెంచర్ చేసిన రియల్టర్ లు, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దశాబ్దాలుగా ప్రజలకు ,రైతుల రాకపోకలకు ఆధారంగా ఉన్న ప్రభుత్వ దారిని సైతం తమ వెంచర్ పరిధిలోకి లాగేసుకున్నారు. రోడ్డు స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా, అక్కడ స్థానిక ప్రజలతోపాటు లీడర్ లు ఎవరూ అడ్డుకోకుండా ముందస్తుగా పావులు కదిపినట్లు సమాచారం.
Paidipalli Land Encroachment : 704 సర్వే నంబర్ లో బరితెగింపు..
పైడిపల్లి రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 704లో వెంచర్ నిర్వాహకులు చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వ దారులను కబ్జా చేస్తూ మ్యాపులను తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సామాన్య ప్రజలు నడవడానికి వీల్లేకుండా రోడ్డును మూసేసి, దాన్ని ప్లాట్ల కింద మార్చడం రియల్ మాఫియా బరితెగింపునకు పరాకాష్టగా నిలుస్తోంది.
అధికారుల కళ్ళు ‘మూయించారా’..?
ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో వచ్చి ఎందుకు తనిఖీ చేయడం లేదన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. వెంచర్ లేఅవుట్ అనుమతుల్లో ఈ రోడ్డు ప్రస్తావన ఉందా? లేక అధికారులే కళ్ళు మూసుకుని సంతకాలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “పైస్థాయి ఒత్తిళ్ల వల్లే అధికారులు మౌనంగా ఉన్నారా?” లేక రియల్ మాఫియా వెదజల్లుతున్న నోట్ల కట్టలకు అధికారులు తలొగ్గారా? అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బహిరంగంగానే విక్రయాలు!
ప్రభుత్వ దారిని కబ్జా (Land Encroachment) చేసి వేసిన ఈ ప్లాట్లను అమాయక ప్రజలకు అంటగట్టేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. రేపు పొద్దున రోడ్డు స్థలం అని తెలిసి అధికారులు చర్యలు తీసుకుంటే, నష్టపోయేది సామాన్యులైన కొనుగోలుదారులే కనుక, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ స్పందించి, పైడిపల్లి రెవెన్యూ శివారు కొత్తపేట వెళ్లే మార్గంలోని 704 సర్వే నంబర్లో జరుగుతున్న ఈ అక్రమ వెంచర్ దందాపై విచారణ జరపాలని, ఆక్రమణకు గురైన ప్రభుత్వ దారిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








