Hyderabad News | సరదాగా చేపల వేటకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల ప్రాణాలను మూసీ నది (Musi River) బలితీసుకుంది. గండిపేట జలాశయం దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ విషాదకర ఘటన వెలుగుచూసింది. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇబ్రహీంబాగ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ (Hyderabad) ఇబ్రహీంబాగ్కు చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25) ముగ్గురూ ప్రాణ స్నేహితులు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా చేపలు పట్టేందుకు గండిపేట పరివాహక ప్రాంతంలోని మూసీ నది వద్దకు వెళ్లారు. అయితే, నదిలో నీటి ఉధృతి, లోతు ఎక్కువగా ఉండటంతో వారు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారు.
యువకులు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీం ఆదివారం సాయంత్రం నుంచే గాలింపు చర్యలు చేపట్టింది. చీకటి పడటంతో గాలింపునకు ఆటంకం ఏర్పడినప్పటికీ, సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను ఒడ్డుకు చేర్చిన రెస్క్యూ టీం, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించింది.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
మృతులు ముగ్గురూ ఒకే కాలనీకి చెందిన వారు కావడం, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితులు కావడంతో ఆ ప్రాంతమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. చేతికి అందిన కొడుకులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు గాంధీ హాస్పిటల్ వద్ద కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








