తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆ పార్టీకి షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
కాంగ్రెస్ కు ‘జీవన్’ మరణశాసనం: రేవంత్ రెడ్డిపై నిప్పులు!
జగిత్యాల కేంద్రంగా సాగిన ఈ రాజకీయ పరిణామాల్లో జీవన్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అనుచరుల సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రధాన అభ్యంతరాలు & విమర్శలు:
పార్టీ నీ ఒక్కడిదే అనుకుంటున్నవా?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “పార్టీ నీ సొంతం అనుకుంటున్నావా? ఎంతమందిని తొక్కుతావు?” అంటూ నిలదీశారు.
ప్రత్యర్థుల చేరికపై ఆగ్రహం:
జగిత్యాల రాజకీయాల్లో తనకు బద్ధ శత్రువులుగా ఉన్న బీఆర్ఎస్ నాయకులను, కనీసం తనతో సంప్రదించకుండానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
“అసలు వేం నరేందర్ రెడ్డి ఎవరు? ఆయన పెత్తనం ఏంటి?” అంటూ పార్టీలో అదనపు శక్తుల జోక్యంపై అసహనం వ్యక్తం చేశారు.అంతేకాకుండా దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి పై కూడా ఆయన విమర్శలు చేశారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి కనీస గౌరవం దక్కడం లేదని, కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గంగారాం హత్య.. ఆఖరి దెబ్బ!
ఇటీవల జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారాం దారుణ హత్యకు గురికావడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఆ క్లిష్ట సమయంలో పార్టీ అధిష్టానం గానీ, ప్రభుత్వం గానీ తనకు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వలేదని, తన మనుషులకే రక్షణ లేనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమని ఆయన ప్రశ్నించారు.
“నమ్ముకున్న సిద్ధాంతానికి, నడిచిన బాటకి విలువ లేనప్పుడు.. ఈ పదవులు, ఈ పార్టీ సభ్యత్వం నాకు అనవసరం.” అని అన్నారు
మున్ముందు ఏం జరగబోతోంది?
జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత తప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.








