- ఈ సీ లేకుండానే గ్రానైట్, స్టోన్ క్రషర్ ల నిర్వహణ
- హన్మకొండ జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా!
- అధికారుల పాత్రపై అనుమానాలు?
జిల్లాలో మైనింగ్ మాఫియా (Mining mafia) ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పర్యావరణ అనుమతులు (EC) గాలికి వదిలేసి, నిబంధనలను తుంగలో తొక్కుతూ గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా.. గనులు, భూగర్భ శాఖ అధికారులు మాత్రం కళ్లున్నా చూడని కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పర్యావరణ అనుమతులు లేవు.. నిబంధనలు అసలే పాటించరు
సాధారణంగా ఏదైనా గ్రానైట్ క్వారీ లేదా స్టోన్ క్రషర్ నిర్వహించాలంటే పర్యావరణ శాఖ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ (EC) తప్పనిసరి. కానీ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ అనుమతులు లేకుండానే మైనింగ్ సాగుతోంది. నిబంధనల ప్రకారం ఈ సి లేకుంటే క్వారీ నడపకూడదు. కానీ అధికారులను మచ్చికచేసుకున్న కొంతమంది క్వారీ యజమానులు అధికారుల నాయనోబయనో ముట్టజెప్పి అక్రమంగా క్వారీలు నడుపుతున్నారు.జిల్లాలోని కొంతమంది క్వారీల యజమానులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించి నిర్ణీత లోతు కంటే ఎక్కువగా తవ్వకాలు జరపడం గమనార్హం.మైనింగ్ శాఖ నుండి అనుమతి పొందిన విస్తీర్ణం కంటే రెట్టింపు స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుపుతూ కోట్లాది రూపాయల రాయల్టీని ఎగ్గొడుతున్నారు.
అధికారుల పాత్రపై అనుమానాలు
మైనింగ్ మాఫియా ఇంతలా రెచ్చిపోతున్నా గనులు, భూగర్భ శాఖ అధికారులు మిన్నకుండిపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు, మాఫియా ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
”చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తుంటే, ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ? పర్యావరణం కలుషితమై మా ఊళ్లు స్మశానాలుగా మారుతున్నాయి.”అని బాధితులు వాపోతున్నారు.
Mining mafia : తక్షణ చర్యలు అవసరం
హన్మకొండ జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి, అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, క్రషర్లపై ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించాలని మేధావులు కోరుతున్నారు. పర్యావరణ అనుమతులు లేని యూనిట్లను తక్షణమే సీజ్ చేసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








