అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గీసుగొండ మండల పరిధిలోని హర్జా తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…హైదరాబాద్లోని పురాణాపూల్కు చెందిన భూక్య రవి (36) వృత్తిరీత్యా డ్రైవర్. శనివారం (ఏప్రిల్ 04) తన పల్సర్ బైక్ (TS12 E 8265) పై సొంతూరు కొల్లాపురం (గూడూరు మండలం) కు వచ్చాడు. తిరిగి ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో హైదరాబాద్కు బయలుదేరాడు.
మార్గమధ్యలో గీసుగొండ మండలం హర్జా తండా గ్రామ శివారులోని ఓంకార్ స్తూపం మలుపు వద్దకు రాగానే, వరంగల్ వైపు నుండి నర్సంపేట వైపు వెళ్తున్న టాటా ఏసీ (AP20 TB 4305) వాహనం రవి బైక్ను బలంగా ఢీకొట్టింది.
అక్కడికక్కడే మృతి..
టాటా ఏసీ డ్రైవర్ పొన్నం వంశీ వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రవి బైక్ పైనుంచి కింద పడిపోగా, తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు.
కేసు నమోదు..
మృతుడి తమ్ముడు భూక్య కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టాటా ఏసీ డ్రైవర్ పొన్నం వంశీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రవికి భార్య, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయన మరణంతో సొంత గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.








