వరంగల్ జిల్లా యంత్రాంగం ముక్కు కిందే విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 95 లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. సుమారు 10 గుంటలకు పైగా భూమిని అక్రమార్కులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పేదల నీడకు ఎసరు.. రూ. కోట్ల భూమి స్వాహా!
గతంలో ఇదే సర్వే నంబర్ 95లో అప్పటి ప్రభుత్వం సుమారు 600 మంది పేదలకు ‘గరీబ్ నగర్’ పేరుతో ఇళ్ల స్థలాలను కేటాయించింది. అయితే, గొర్రెకుంట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను ఈ మిగులు భూమిపై పడింది. అధికారుల కళ్లు గప్పి, రాత్రికి రాత్రే హద్దులు చెరిపేసి.. భూమిని కలుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికారుల ‘మౌనం’.. కబ్జాదారులకు ‘వరం’!
కొత్త కలెక్టరేట్ నిర్మాణంతో ఈ ప్రాంత భూములకు భారీ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే పక్కా స్కెచ్ తో ప్రభుత్వ భూమిని కలుపుకున్న అక్రమార్కులు 10 గుంటల భూమిని హరించుకుపోగా, తక్షణమే స్పందించకపోతే మిగిలిన భూమి కూడా ప్రైవేటు వ్యక్తుల హస్తగతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా గీసుగొండ రెవెన్యూ యంత్రాంగం కనీసం అటువైపు చూడకపోవడం వెనుక ఆంతర్యమేమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
స్థానిక ప్రజల డిమాండ్..
తహశీల్దార్ నేతృత్వంలో తక్షణమే సర్వే నంబర్ 95 లోని భూమిని రీ-సర్వే చేయాలి.ప్రభుత్వ భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించి, రక్షణ కంచె (Fencing) ఏర్పాటు చేయాలి. సర్కారు ఆస్తులను కబళించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.“కళ్లముందే కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపద అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని, గీసుగొండ తహశీల్దార్ రియాజుద్దీన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆక్రమణలను అడ్డుకోవాలి” అని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.








