జిల్లాలోని ఉప్పరపల్లిలో గల సాయిరాం రైస్ మిల్లులోని ధాన్యం నిల్వల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం వచ్చిన ధాన్యం నిల్వలలో భారీ తేడాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 32 ఏసీకేల (ACKs) ధాన్యంలో సగానికి పైగా మాయమైనట్లు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై బుధవారం”సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో సర్కారు ధాన్యం భద్రమేనా” అనే కథనాన్ని సర్కార్ లైవ్ ప్రచురించింది. అయితే ఈ మిల్లులోని ధాన్యం నిల్వల లెక్కలు తేల్చేందుకు వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి రంగంలోకి దిగుతారా లేదా అనేది ప్రశ్నగా మారింది..
Rice Mill Scam : అసలేం జరుగుతోంది?
గత కొంతకాలంగా ఈ మిల్లుకు కేటాయించిన ధాన్యం నిల్వలు, నివేదికల్లో చూపిస్తున్న లెక్కలకు పొంతన లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు సగానికి పైగా ధాన్యం నిల్వలు మిల్లులో భౌతికంగా లేవని, వాటిని పక్కదారి పట్టించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 32 ఏసీకేల ధాన్యం నిల్వల్లో సగానికి పైగా నిల్వలు మాయమైనట్లు సమాచారం.మిల్లులో అసలు ఎంత ధాన్యం ఉంది? ఎంత మిల్లింగ్ అయింది? అనే అంశాలపై ఫిజికల్ వెరిఫికేషన్ (భౌతిక తనిఖీ) చేయాలని రైతులు, పౌర సరఫరాల విభాగం వర్గాలు కోరుతున్నాయి.
అదనపు కలెక్టర్ రాకపై ఉత్కంఠ:
ఈ వ్యవహారంపై అదనపు కలెక్టర్ (మేడం) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆమె స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడితేనే అసలు లెక్కలు తేలే అవకాశం ఉందని సర్వత్రా చర్చ జరుగుతోంది.ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని మిల్లింగ్కు అప్పగిస్తుంటే, ఇలాంటి అక్రమాలు జరిగితే ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడే అవకాశం ఉంది.
లెక్క తేలేనా..?
వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం గనుక చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి లోని సాయిరాం రైస్ మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తే,ధాన్యం నిల్వల గుట్టయ్యే అవకాశం ఉంది. మరి అదనపు కలెక్టర్ రంగంలోకి దిగుతారా?ధాన్యం లెక్కలు తెలుస్తారా? లేదా అనేది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది.








