32 ఏసీకేల బియ్యం పెండింగ్.. ‘ఉప్పరపల్లి’ మిల్లుపై జోరుగా ప్రచారం!
వరంగల్ జిల్లా ఉప్పరపల్లిలోని సాయిరాం బిన్నీ రైస్ మిల్లు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో (CMR) ఈ మిల్లు భారీగా వెనుకబడి ఉండటంతో పాటు, అక్కడ ఉండాల్సిన ధాన్యం నిల్వలు మాయమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
32 ఏసీకేలకు సరిపడా ధాన్యం భద్రమేనా!
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ మిల్లులో సుమారు 32 ఏసీకేల (ACKs) మేర బియ్యం నిల్వలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సకాలంలో ఎఫ్.సి.ఐ (FCI)కి,పౌరసరఫరాల శాఖ కు అప్పగించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అసలు సదరు మిల్లులో ధాన్యం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 3 కోట్ల ధాన్యంలో సగానికి పైగా మాయం ?
ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం మిల్లులో ఉండాల్సిన నిల్వల విలువ దాదాపు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే, క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం.. మిల్లులో ఉండాల్సిన ధాన్యంలో సగానికి పైగా నిల్వలు ఇప్పటికే మాయమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నిల్వ ఉంచాల్సిన ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం పక్కదారి పట్టించిందా? లేక ప్రైవేటుగా విక్రయించిందా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులకు కనిపించడం లేదా ?
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం నిల్వలు ప్రశ్నార్థకంగా మారినా, సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులకు ఎందుకు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మిల్లుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి, నిల్వలను లెక్కించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఉప్పరపల్లిలోని సాయిరాం బిన్నీ రైస్ మిల్లుపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సిందే.








