Keerthinagar Land Digital Survey | ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములపై “సర్కార్ లైవ్” లో వెలువడిన కథనాలకు స్పందించిన కలెక్టర్, తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి (AD) ఆధ్వర్యంలో రెవెన్యూ బృందం భూముల సర్వే నిర్వహించింది.
సర్కార్ లైవ్ కథనానికి స్పందన
మంగళవారం సర్కార్ లైవ్ లో “కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే ప్రభుత్వ భూమి దక్కేది” అనే శీర్షికతో వెలువడిన వార్త జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. కీర్తినగర్ పరిధిలోని హౌజింగ్ బోర్డు భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఫిర్యాదులను,వార్తా కథనాలను కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు. సర్వే ద్వారా వాస్తవాలను వెలికితీయాలని ఆదేశించడంతో అధికారులు హుటాహుటిన క్షేత్రస్థాయికి చేరుకున్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో సర్వే
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి (AD) పర్యవేక్షణలో సిబ్బంది డిజిటల్ సర్వే నిర్వహించారు. పాత రికార్డులను, మ్యాపులను సరిచూశారు.
హౌజింగ్ బోర్డు భూమి ఎంత మేర ఉంది? ఎంతమేరకు ఆక్రమణకు గురైనది ? అనే కోణంలో కొలతలు వేశారు. జిపిఎస్ (GPS) రీడింగ్ల ద్వారా సరిహద్దులను గుర్తించారు.
Keerthinagar Land Digital Survey : హద్దులు ఏర్పాటు చేస్తాం: తహశీల్దార్
గీసుగొండ తహశీల్దార్ మాట్లాడుతూ.. “కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో ఏడి ఆధ్వర్యంలో సర్వే జరిగింది. సర్వే రిపోర్టు వచ్చిన వెంటనే హౌజింగ్ బోర్డు భూములకు శాశ్వత ప్రాతిపదికన హద్దులు (Fencing) ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
స్థానికుల హర్షం..
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న హౌజింగ్ బోర్డు భూముల వివాదంపై కలెక్టర్ వేగంగా సానుకూలంగా స్పందించడం పట్ల కీర్తినగర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై వార్తా కథనాలు అధికారులను మేల్కొల్పుతాయని ఈ ఘటన మరోసారి నిరూపించిందని స్థానికులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








