Fee Looting in Hanumakonda | విద్య ముసుగులో వ్యాపారం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ‘నాగేశ్వరరావు ట్యూషన్స్’ తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ, భద్రతా ప్రమాణాలను విస్మరించి ఈ సంస్థ సాగిస్తున్న ‘ఫీజుల దోపిడీ’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అనుమతులు లేవు.. అన్నీ అక్రమమే!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా ట్యూషన్ సెంటర్ నిర్వహించాలంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరి. కానీ, నాగేశ్వరరావు ట్యూషన్స్ యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండానే హన్మకొండ, వరంగల్, నర్సంపేట వంటి ప్రధాన కేంద్రాల్లో యథేచ్ఛగా బ్రాంచ్లను నిర్వహిస్తోంది. ఆకర్షణీయమైన ప్రకటనలతో తల్లిదండ్రులను నమ్మిస్తూ, భారీగా ఫీజులు వసూలు చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.
గొర్రెల మందల్లా విద్యార్థులు.. కనీస వసతులు శూన్యం
ఈ ట్యూషన్ సెంటర్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సంస్థ నిర్వాహకులు కేవలం లాభాలే ధ్యేయంగా వ్యవహరిస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. గాలి, వెలుతురు సరిగా లేని చిన్న గదుల్లో విద్యార్థులను గొర్రెల మందల్లా కూర్చోబెడుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస శానిటేషన్ సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదంలో విద్యార్థుల ప్రాణాలు!
ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత) నిబంధనలను ఈ సంస్థ పూర్తిగా గాలికి వదిలేసింది. వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చే ఈ కేంద్రాల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేని ఇలాంటి సెంటర్లపై విద్యార్థి సంఘాలు,సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు కు సిద్ధం
స్థానిక అధికారుల కళ్ళు గప్పి సాగిస్తున్న ఈ అక్రమ వ్యాపారంపై సామాజిక కార్యకర్తలు, బాధితులు ఇప్పుడు రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అనుమతులు లేని అన్ని బ్రాంచ్లను వెంటనే తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.కనీస భద్రతా ప్రమాణాలు పాటించని కేంద్రాలను తక్షణమే మూసివేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.








