KCR Jagtial Sabha | తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి జగిత్యాల వేదికవుతోంది. కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు, ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాల మినీ స్టేడియంలో సమరశంఖం పూరించబోతున్నారు. ఐదు దశాబ్దాల క్రితం రైతుకూలీల జైత్రయాత్రతో జంగ్ నడిపిన ఈ గడ్డపై, ఇప్పుడు మరో రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధమైంది. సభా వేదికగా కేసీఆర్ చేసే ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
జగిత్యాల ఖిల్లా: కలిసొచ్చిన సెంటిమెంట్
జగిత్యాల గడ్డకు మరియు కేసీఆర్కు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ మినీ స్టేడియంలో సభ (KCR Jagtial Sabha) జరిగినప్పుడల్లా ఉద్యమంలో లేదా రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు వచ్చాయి.
- 2001: పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి సభతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది.
- 2003: ధర్మపురి సింహగర్జనతో గోదావరి పుష్కరాలకు నిధులు సాధించిన ఘనత కేసీఆర్ది.
- 2006: తెలంగాణ ఉద్యమ దశను మార్చిన ‘భారీ ధూంధాం’ ఇదే మినీ స్టేడియంలో జరిగింది. గద్దర్, రసమయి నేతృత్వంలో జరిగిన ఆ సభ అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది.
- 20 ఏళ్ల తర్వాత: సరిగ్గా అదే స్టేడియంలో నేడు మళ్లీ కేసీఆర్ ప్రజా గొంతుకగా నిలవబోతున్నారు.
బీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ఈ సభకు మరో ప్రధాన ఆకర్షణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనుండటం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన, తన వందలాది మంది అనుచరులతో కలిసి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం జగిత్యాల అంతటా ‘కేసీఆర్ రావాలి.. రేవంత్రెడ్డి పోవాలి’ అనే నినాదం మార్మోగుతోంది.
కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్ గురి?
సుమారు ఏడాది కాలం పాటు కొత్త ప్రభుత్వానికి సమయం ఇచ్చిన కేసీఆర్, ఇప్పుడు వైఫల్యాలపై గళమెత్తనున్నారు.
- విఫలమైన గ్యారెంటీలు: ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- రైతాంగ సమస్యలు: ఎరువుల కొరత, రైతుభరోసా నిలిపివేత, కరెంట్ కోతలు, సాగునీటి కష్టాలపై కేసీఆర్ విరుచుకుపడే అవకాశం ఉంది.
- నిరుద్యోగం: జాబ్ క్యాలెండర్ లేకపోవడం, నోటిఫికేషన్ల జాప్యంపై నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని కేసీఆర్ ప్రస్తావించనున్నారు.
- సంక్షేమ పథకాల నిలిపివేత: పెన్షన్ల పెంపు లేకపోవడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు నిధుల కోత వంటి అంశాలను కేసీఆర్ ఎండగట్టనున్నారు.
KCR Jagtial Sabha : సభ కోసం భారీ ఏర్పాట్లు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో నియోజకవర్గాల వారీగా ఇన్చార్జులను నియమించి జన సమీకరణ చేపట్టారు. వేదిక: 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారి కోసం 3 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. స్టేడియానికి రాలేని వారి కోసం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీ ఎల్ఈడీ (LED) స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ధరూర్ నుంచి స్టేడియం వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర ఫ్లెక్సీలు, తోరణాలతో జగిత్యాల గులాబీ రంగును పులుముకుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి.








