●కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సమగ్ర విచారణ.. NDSA మార్గదర్శకాలతోనే ముందుకు
●లోతుగా పరిశీలన… సాంకేతిక పరీక్షల సమీక్ష
కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని సోమవారం మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. కుంగిన పిల్లర్ర్స్ (స్తంభాల) వద్ద జరుగుతున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను స్వయంగా పరిశీలించి, పునరుద్ధరణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
లోతుగా పరిశీలన.. సాంకేతిక పరీక్షల సమీక్ష
బ్యారేజీ వద్ద పిల్లర్స్ 20, 21, 22 లో బోర్ రిగ్స్ ద్వారా జరుగుతున్న శాంపిల్స్ సేకరణను ముఖ్యమంత్రి నిశితంగా గమనించారు. దాదాపు 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన నమూనాలను సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) కు పంపనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ల్యాబ్ పరీక్షల అనంతరం బ్యారేజీ పునాదుల పటుత్వంపై పూర్తి స్పష్టత వస్తుందని సీఎం తెలిపారు.
పర్యటనలోని ముఖ్యాంశాలు:
డ్రోన్ టెక్నాలజీ: 20 నుండి 30 మీటర్ల లోతు వరకు నేల స్వభావాన్ని విశ్లేషించే ‘డ్రోన్ బేస్డ్ GPR’ టెస్ట్ గురించి అధికారులు వివరించారు.
సీస్మిక్ టెస్టులు: సీలెంట్ పైల్స్ స్థితిగతులను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న ‘హారిజాంటల్ క్రాస్హోల్ సీస్మిక్ టెస్ట్’ వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
NDSA మార్గదర్శకాలు: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రతి అడుగులో వారి అనుమతి తప్పనిసరని సీఎం స్పష్టం చేశారు.
సమస్య అర్థమైతే సగం పరిష్కారం దొరికినట్లే: సీఎం రేవంత్ రెడ్డి
పర్యటన అనంతరం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. “మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలను సరిదిద్దే విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. లోపాన్ని సరిగ్గా గుర్తించి అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్లే. శాంపిల్స్ ఫలితాల ఆధారంగా శాశ్వత పునరుద్ధరణ పనులు చేపట్టాలి” అని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి,అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, NDSA చైర్మన్ అనిల్ జైన్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు మరియు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.








