Keerthinagar Housing Board Lands | వరంగల్ నగరంలోని కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములు ఇప్పుడు ఆక్రమణదారుల గుప్పిట్లోకి వెళ్తున్నాయి. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సత్య శారద స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం “అడవిలో వెన్నెల” చందంగా మారింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం, హౌజింగ్ బోర్డు అధికారుల మధ్య సమన్వయ లోపం ఆక్రమణదారులకు వరంగా మారుతోంది.
హౌజింగ్ బోర్డు భూముల అన్యాక్రాంతం పై “సర్కార్ లైవ్ “వరుస కథనాలకు స్పందించిన కలెక్టర్ తక్షణమే సర్వే పూర్తి చేసి హౌజింగ్ బోర్డు భూములకు హద్దులు నిర్ణయించాలని ఆదేశించగా సదరు భూములపై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి ఈ నెల 13 వ తేదీన సర్వే పేరుతో హడావుడి చేసి చేతులు దులుపుకొన్నారు
వివాదానికి ప్రధాన కారణాలు
రికార్డుల సాకు: భూ సేకరణకు సంబంధించిన పూర్తి రికార్డులు ఇస్తేనే సర్వే సాధ్యమని ఏడీ చెబుతుండగా, హౌజింగ్ అధికారులు రికార్డులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు.
అధికారుల కుమ్మక్కు?: హౌజింగ్ బోర్డులోని కొందరు కీలక అధికారులు రియల్టర్లతో చేతులు కలిపారన్న ఆరోపణలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి.
ఆక్రమణల పర్వం: గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 561, 562లో ఇప్పటికే 2 నుండి 3 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు ప్రచారం.
హౌజింగ్ బోర్డు అధికారుల నుండి స్పందన కరువైందా?
ఈ సర్వే జాప్యంపై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వరంగల్ ఏడీ ని సర్కార్ లైవ్ ప్రతినిధి వివరణ కోరగా, హౌజింగ్ బోర్డు అధికారుల నుండే స్పందన లేదని పేర్కొంటున్నారు. భూ సేకరణ కు సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులు అందజేయాలని తాము హౌజింగ్ బోర్డు అధికారులను కోరామని, ఆ రికార్డులు అందిన తర్వాతే పూర్తి సర్వే అవుతుందని ఏడీ స్పష్టం చేశారు. హౌజింగ్ బోర్డు అధికారులు రికార్డుల విషయంలో జాప్యం చేస్తుండటంతో సర్వే ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.హౌజింగ్ బోర్డు లోని కీలకమైన ఓ ఇద్దరు అధికారులు రియల్టర్ లతో కుమ్మక్కు కావడం వల్లే వారు సర్వే కు సహకరించట్లేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
Housing Board Lands | సర్వే నెం..561,562 లో ఆక్రమణల ముప్పు
వరంగల్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం హద్దులు ఏర్పాటు చేయడంలో జరుగుతున్న ఈ జాప్యం స్థానికంగా పలు అనుమానాలకు దారితీస్తోంది. హౌజింగ్ బోర్డు భూములు ఏవన్నది స్పష్టంగా తేలకపోవడంతో, ఆ ఖాళీ స్థలాలను ఆక్రమించేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా పావులు కదుపుతోంది.గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నెం:561,562లోని భూమి వేగంగా కబ్జా కు గురైతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇప్పటికే సుమారు 2 నుండి 3 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తే, చివరకు హౌజింగ్ బోర్డు భూమి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కలెక్టర్ సీరియస్ గా తీసుకొని భూమిని రక్షించాలి..
ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన బాధ్యత కలిగిన హౌజింగ్ బోర్డు మరియు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం సమన్వయంతో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని, రికార్డుల బదలాయింపు పూర్తి చేయించి, కీర్తినగర్ భూములకు శాశ్వత హద్దులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.అప్పుడే ప్రభుత్వ ఆస్తికి రక్షణ లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జిల్లా పరిపాలనలో ఇప్పటికే తన మార్క్ చూపిస్తున్న కలెక్టర్ సీరియస్ గా తీసుకుంటే తప్ప హౌజింగ్ బోర్డ్ భూములు దక్కేలా కనపడటంలేదు








