- ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్..
- 90 శాతం కాలిన గాయాలతో ఎంజీఎంకు తరలింపు!
RTC Strike | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉగ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న కార్మికులు, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుండటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (Shankar Goud) ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని..
నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న బోలా శంకర్ గౌడ్ () , గత రెండు రోజులుగా సాగుతున్న సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడం, తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆవేదనతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నిరసన ప్రదర్శన జరుగుతున్న సమయంలో అందరూ చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన తోటి కార్మికులు, వెంటనే మంటలను ఆర్పివేశారు.
90 శాతం కాలిన గాయాలు – పరిస్థితి విషమం
ఈ ఘోర ప్రమాదంలో శంకర్ గౌడ్ శరీరానికి దాదాపు 90 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆయనను వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం (MGM) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన మృత్యువుతో పోరాడుతున్నారు.
RTC Strike : డిపో వద్ద దహనకాండ.. అధికారులపై ఆగ్రహం
శంకర్ ఆత్మహత్యాయత్నంతో నర్సంపేట డిపో వద్ద పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆగ్రహించిన కార్మికులు డిపో ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. “నర్సంపేట డిఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం స్పందించి చర్చలను సఫలం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గమనిక: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే తక్షణమే నిపుణులను లేదా హెల్ప్లైన్ నంబర్ 9152987821 కు సంప్రదించండి.








