- సర్కార్ లైవ్ కథనాలకు స్పందించిన ప్రభుత్వం
- పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు
Online Truck Sheet Cancelled | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్దిరోజులుగా రైతులు, ఐకేపీ (IKP) కేంద్రాల నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, వివాదాస్పదంగా మారిన ‘ఆన్లైన్ ట్రక్ షీట్’ విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేసింది. ఇకపై ధాన్యం సేకరణ పాత పద్ధతిలోనే కొనసాగనుంది.
“సర్కార్ లైవ్” కథనాలకు స్పందించిన ప్రభుత్వం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆన్లైన్ ట్రక్ షీట్ల వల్ల ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, సర్వర్ల మొరాయింపు, తద్వారా లారీల రాకపోకల్లో జరుగుతున్న జాప్యంపై ‘సర్కార్ లైవ్’ (Sarkar Live) వంటి వార్తా సంస్థలు వరుస కథనాలను వెలువరించింది. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న అగచాట్లు, వర్షాల భయంతో ఆందోళన చెందుతున్న వైనాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేవిధంగా “సర్కార్ లైవ్” కథనాలు వైరల్ అయ్యాయి.ఈ కథనాలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, వెంటనే ఈ నిబంధనను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయంతో చేకూరే ప్రయోజనాలు
ఆన్లైన్ ఎంట్రీల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ధాన్యం లోడ్ అయిన వెంటనే లారీలను మిల్లులకు పంపవచ్చు.సర్వర్ డౌన్ సమస్యల వల్ల నిలిచిపోయిన కొనుగోళ్లు ఇప్పుడు మళ్లీ పుంజుకోనున్నాయి.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోకుండా, ఎప్పటికప్పుడు సేకరణ జరగడం వల్ల రైతులకు ఇబ్బందులు ఉండవు. పాత పద్ధతిలో రికార్డులను నమోదు చేస్తూనే, కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. “సర్కార్ లైవ్”కథనాల వల్ల ప్రభుత్వం త్వరితగతిన స్పందించి, అన్నదాతలకు మేలు చేకూర్చే ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.








