- గాంధీనగర్ (మాణిక్యాపూర్ )లో రూ 2 కోట్ల ధాన్యం గల్లంతైనట్లు ఆరోపణలు
- ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే డి సి ఎస్ ఓ సైతం విస్తుపోవాల్సిందే
- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్(మాణిక్యాపూర్)లో మిల్లర్ ఇష్టారాజ్యం
Rice Mill Scam in Bheemadevarapalli | హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ (మాణిక్యాపూర్) గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో 2025-26 ఖరీఫ్ సీజన్ భారీస్థాయిలో ధాన్యం గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం మిల్లు నుండి మాయమైనట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
ప్రభుత్వం నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, సదరు మిల్లర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం మిల్లులో నిల్వ ఉండాల్సిన ధాన్యం భారీ మొత్తంలో మాయమైందని, దీని విలువ సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
నిబంధనలను బేఖాతరు చేస్తూ, అధికారుల కళ్ళు గప్పి ధాన్యాన్ని అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (DCSO) స్వయంగా వచ్చి ఫిజికల్ వెరిఫికేషన్ (భౌతిక తనిఖీ) నిర్వహిస్తే, మిల్లులో నిల్వ ఉన్న ధాన్యానికి, రికార్డులకు పొంతన ఉండదని, ఆ లెక్కలు చూసి ఉన్నతాధికారులే విస్తుపోవాల్సి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే మిల్లర్ గుట్టు రట్టు
ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే సదరు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టాలని, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








