Surveyor Land Scam : విధులకు పంగనామం.. రియల్ ఎస్టేట్కు జై!
కంచే చేను మేసిన చందంగా.. భూములను కొలవాల్సిన సర్వేయర్ ఏకంగా ప్రభుత్వ భూమినే స్వాహా చేసేశారు. సామాన్య ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, నేడు కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఒక ప్రభుత్వ సర్వేయర్ నిర్వాకం (Surveyor Land Scam) సొంత గ్రామంతోపాటు ఆయనతో కలిసి చదువుకున్న దోస్తుల్లో కూడా చర్చనీయాంశం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వేయర్ గా ఉంటూ వెంచర్ ల దందా కొనసాగిస్తున్న సదరు సర్వేయర్ అంశం ఇప్పుడు వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
సొంత గ్రామంలోనే ‘ప్లాట్ల’ పర్వం
సదరు సర్వేయర్ తన సొంత గ్రామమైన శాయంపేట హావేలి లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని యధేచ్ఛగా ప్లాట్లు చేసి బందువులకే విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయడంలో తనకున్న పట్టును ఉపయోగించుకుని, సర్కారు భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసి భారీగా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారం ప్రస్తుతం గ్రామంతోపాటు తన మిత్రుల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది
నక్కలగుట్ట కేంద్రంగా ‘సిండికేట్’ దందా
ఈ అధికారికి విధుల కంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే మక్కువ ఎక్కువ. హన్మకొండలోని నక్కలగుట్టలో ఉన్న ఒక ప్రైవేట్ కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఒక ఆఫీసును ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.మరో ముగ్గురు ప్రభుత్వ సర్వేయర్లతో కలిసి ఒక ‘సిండికేట్’గా ఏర్పడి వెంచర్ల దందా కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది.ప్రభుత్వ కార్యాలయానికి రావాల్సిన సమయాన్ని ఈ ప్రైవేట్ ఆఫీసులోనే గడుపుతూ సదా.. ఆనందంగా అక్రమాల పర్వం కొనసాగిస్తున్నట్లు సమాచారం.
టెక్స్టైల్ పార్కు చుట్టూ రియల్ చక్రం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్ జిల్లాలోని టెక్స్టైల్ పార్కు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రావడంతో, ఈ సర్వేయర్ల బృందం అక్కడ తిష్ట వేసింది. సర్వే చేయడానికి వెళ్లిన చోటల్లా యజమానులను ప్రలోభపెట్టడం లేదా బెదిరించడం ద్వారా భూములను చేజిక్కించుకుని వెంచర్లుగా మారుస్తున్నట్లు ప్రచారం జరగడం గమనార్హం.
సాధారణ ఉద్యోగి.. బడా రియల్టర్!
కొద్ది ఏళ్ల క్రితం వరకు సాధారణ ఉద్యోగిగా ఉన్న ఈ సర్వేయర్, తక్కువ కాలంలోనే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. విధులకు హాజరు కాకుండా, ఎప్పుడూ రియల్ ఎస్టేట్ సైట్లలోనే కనిపిస్తూ ‘బిజినెస్ మాగ్నెట్’గా అవతరించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే ఇలా అక్రమాలకు పాల్పడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి, సదరు సర్వేయర్తో పాటు అతనితో జతకట్టిన సర్వేయర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
శాయంపేట హావేలి లోని ప్లాట్లు గా మార్చి విక్రయించిన ప్రభుత్వ భూమి సంగతేంది?
సదా.. ఆనందంగా రియల్టర్ గా ఎదిగిన ఆ ప్రభుత్వ సర్వేయర్ కు సహకరిస్తున్న సర్వేయర్ లు ఎవరు
వీరి వెంచర్ ల కహానీ ఏంది?
సాధారణ ఉద్యోగి కోట్లకు ఎలా పడగలెత్తాడు
సదయ్య అలియాస్ సదానందం పై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏసీబీ డిజి, వరంగల్ జిల్లా కలెక్టర్ కు సోషల్ యాక్టివిటిస్టులు నేడో, రేపో ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.








