అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. లంచం డబ్బుల కోసం బాధితులను వేధిస్తున్న ప్రభుత్వ అధికారుల గుట్టురట్టు చేస్తున్నారు. తాజాగా సోమవారం మేడ్చల్ జిల్లా శామీర్పేట్ తహశీల్దార్ (MRO) సుచరిత ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఒక బాధితునికి సంబంధించిన రెవెన్యూ పనిని పూర్తి చేయడానికి తహశీల్దార్ సుచరిత రూ. 2 లక్షల నగదును లంచంగా డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చుకోలేక, అవినీతి అధికారికి బుద్ధి చెప్పాలనుకున్న బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం రచించారు.
డ్రైవర్ ద్వారా లంచం.. పక్కా ప్లాన్తో పట్టుకున్న ఏసీబీ
తహశీల్దార్ ఆదేశాల మేరకు ఆమె ప్రైవేట్ డ్రైవర్ బాధితుడి నుంచి రూ. 2 లక్షల నగదును తీసుకుంటుండగా, పొంచివున్న ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, తహశీల్దార్ సుచరితతో పాటు ఆమె డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
కార్యాలయంలో ముమ్మర సోదాలు:
అరెస్ట్ అనంతరం శామీర్పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు.ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఒక మండల స్థాయి కీలక అధికారి లంచం తీసుకుంటూ దొరికిపోవడం స్థానిక ప్రభుత్వ వర్గాలతో పాటు ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది.








