ఇంటి స్థలం కొలతల విషయంలో తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానలా మారి, ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నానికి దారితీసిన ఘటన గీసుగొండ మండల పరిధిలోని దస్రు నాయక్ తండా (మంగళ తండా) లో చోటుచేసుకుంది. గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అప్పుల బాధతో స్థలం విక్రయం..
మంగళ తండాకు చెందిన కేలోతు కవిత, ఆమె భర్త శ్రీధర్ అప్పుల బాధలు తాళలేక తమకు ఉన్న ఇల్లు, ఇంటి స్థలాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కవిత ఆడబిడ్డ అయిన గూగులోతు విజయ (భువనగిరి), మరియు జరుపుల మంగమ్మ (మంగళ తండా) లు ఆ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 24వ తేదీన గ్రామ పెద్దల సమక్షంలో ఒక గుంట స్థలానికి రూ. 2,60,000 చొప్పున ధర నిర్ణయించుకుని, లక్ష రూపాయలను అడ్వాన్స్గా కూడా చెల్లించారు.
కొలతల వేళ వివాదం – చెప్పులతో దాడి..
మరుసటి రోజు (మే 25న) మధ్యాహ్నం 2:00 గంటల ప్రాంతంలో కవిత, ఆమె భర్త శ్రీధర్ గ్రామ పెద్దలతో కలిసి స్థలాన్ని కొలిచి కొనుగోలుదారులకు అప్పగించేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న కేలోతు శ్రీను, కేలోతు పద్మ, జరుపుల మంగమ్మ, జరుపుల రమేష్, గూగులోతు విజయ, మరియు కేలోతు గోరిలు ఒక్కసారిగా కవిత, శ్రీధర్లతో గొడవకు దిగారు. బాధితులను అందరి ముందూ తీవ్ర పదజాలంతో బూతులు తిడుతూ, చేతులతో, చెప్పులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
మనస్తాపంతో గడ్డిమందు తాగిన శ్రీధర్..
పలువురి ముందు జరిగిన ఈ ఘోర అవమానాన్ని, పరాభవాన్ని భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన కేలోతు శ్రీధర్.. నిన్న సాయంత్రం 4:00 గంటల సమయంలో తన ఇంట్లో ఉన్న గడ్డి మందు (పురుగుల మందు) తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే నర్సంపేటలోని రాజేంద్రప్రసాద్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
కేసు నమోదు..
బాధితుడి భార్య కేలోతు కవిత ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీస్ స్టేషన్లో ఆరుగురు నిందితులపై (కేలోతు శ్రీను, కేలోతు పద్మ, జరుపుల మంగమ్మ, కేలోతు గోరి, గూగులోతు విజయ, జరుపుల రమేష్) ల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ డి. విశ్వేశ్వర్ పేర్కొన్నారు.








