- సర్వే నెం. 95 పై కన్నేసిన స్థానిక లీడర్లు.. దర్జాగా వెంచర్!
- కబ్జాకు గురైన భూమి విలువ రూ. 2 కోట్ల పైమాటే!
- ప్రభుత్వ భూమిగా తేల్చిన గీసుగొండ తహసీల్దార్.. అయినా ఆగని అక్రమార్కులు!
Govt Land Encroachment in Gareeb Nagar | అధికార బలం, రాజకీయ అండదండలు ఉంటే చాలు.. సర్కార్ భూమిని సైతం అడ్డగోలుగా నొక్కేయవచ్చని భావిస్తున్నారు కొంతమంది స్థానిక నాయకులు.వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని గరీబ్ నగర్లో విలువైన ప్రభుత్వ భూమిపై స్థానిక లీడర్లు కర్చీఫ్ వేశారు. ఏకంగా రూ. 2 కోట్ల పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి, ప్రైవేటు వెంచర్గా మార్చేందుకు స్కెచ్ వేసిన ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
సర్వే నెం. 95 లో అడ్డగోలు కబ్జా..
గరీబ్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 95 లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఉంది. అయితే, ఈ భూమిపై కన్నేసిన కొందరు స్థానిక లీడర్లు రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ భూమిలో దర్జాగా వెంచర్ ఏర్పాటు చేశారు. సామాన్యుడికి గజం భూమి దక్కడమే గగనమైన ఈ రోజుల్లో.. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని నమిలేసేందుకు పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేశారు.
తేల్చేసిన తహసీల్దార్.. అయినా బరితెగింపు!
ఈ భూమిపై ఫిర్యాదులు రావడంతో గీసుగొండ తహసీల్దార్ మరియు రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే సదరు స్థలంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. సంచలన విషయమేమిటంటే.. అధికారులు నిర్వహించిన సర్వేలో అది స్పష్టంగా “ప్రభుత్వ భూమి” అని తేలింది. స్వయంగా తహసీల్దార్ గారే అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించినప్పటికీ, సదరు లీడర్ల బరితెగింపు మాత్రం తగ్గలేదు. రెవెన్యూ అధికారుల హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ.. ఆ భూమిని ప్లాట్లుగా మార్చి, అమాయక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Land Encroachment : అధికారుల చర్యలకై ఎదురుచూపులు!
దాదాపు రూ. 2 కోట్లకు పైగా విలువైన ఈ ప్రభుత్వ భూమిని అక్రమార్కుల పాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు జిల్లా యంత్రాంగంపై ఉంది. సర్వేలో ప్రభుత్వ భూమిగా తేలిన తర్వాత కూడా వెంచర్ పనులు ఎలా కొనసాగుతున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, గరీబ్ నగర్ సర్వే నెం. 95 లోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, కబ్జాకు పాల్పడిన సదరు స్థానిక లీడర్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అక్రమార్కుల పరం కావడం ఖాయంగా కనిపిస్తోంది..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








