- పరకాల తహసీల్దార్పై బాధితుల ఆగ్రహం !
- ఆర్ఐ, జీపీఓ రిపోర్టులు లేకుండానే పట్టా జారీ?
- సాగు చేయని భూమికి రెవెన్యూ అధికారుల ‘కృప’!
- ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్
Illegal Land Mutation | హన్మకొండ జిల్లా పరకాల మండలంలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం బట్టబయలైంది. కోర్టు పరిధిలో ఉండి, క్షేత్రస్థాయి పరిశీలన కూడా లేని ఒక వివాదాస్పద భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, పట్టా పాస్ పుస్తకాలు కూడా జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. పరకాల మండలం మాదారం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…పరకాల మండలం మాదారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 665లో గల 16 గుంటల భూమి ప్రస్తుతం న్యాయస్థానంలో వివాదంలో ఉంది. ఈ భూమిపై కోర్టు కేసు నడుస్తుండటంతో, ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయవద్దని బాధితులు గత మార్చి నెలలోనే తహసీల్దార్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, ఆ ఫిర్యాదును బుట్టదాఖలు చేసిన తహసీల్దార్… సదరు వివాదాస్పద భూమిని తలా 8 గుంటల చొప్పున ఇద్దరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసి, పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా అందజేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.
నిబంధనలు గాలికి.. అంత వేగం వెనుక అంతర్యం ఏంటి?
సాధారణంగా ఏదైనా భూమికి మ్యూటేషన్ (పట్టా మార్పిడి) ప్రక్రియ జరగాలంటే.. క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) పరిశీలన,రిపోర్ట్ అలాగే జీపీఓ (GPO) రిపోర్టులు అత్యంత కీలకం. కానీ, ఈ భూమి వ్యవహారంలో ఎలాంటి నివేదికలు లేకుండానే మ్యూటేషన్ ప్రక్రియను చకచకా పూర్తిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
”కనీసం అక్కడ వ్యవసాయం కూడా చేయని వ్యక్తుల పేరిట పట్టా పాసు పుస్తకాలు ఎలా జారీ చేస్తారు? నియమ నిబంధనలను తుంగలో తొక్కి, కోర్టు పరిధిలో ఉన్న భూమిపై ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న ‘అంతర్యం’ ఏంటో రెవెన్యూ అధికారులే సమాధానం చెప్పాలి” అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
Illegal Land Mutation : ఉన్నతాధికారులు విచారణ జరపాలి: బాధితుల డిమాండ్
అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ భూ రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ వ్యవహారంపై హన్మకొండ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్తో పాటు బాధ్యులైన ఇతర సిబ్బందిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
తహసీల్దార్ వింత సమాధానం…

ఈ వివాదానికి సంబంధించి స్థానిక తహసీల్దార్ తోట విజయలక్ష్మి ని సర్కార్ లైవ్ ప్రతినిధి వివరణ కోరగా 665 సర్వే నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెడుతామని, కోర్టు కేసు ఉన్న విషయం తనకు తెలియదని అన్నారు. వ్యవసాయం చేయని భూమికి పట్టా ఎలా చేసారని అడగగా అందరు తహసీల్దార్ లు చేసిన విధంగానే తాను చేశానని వింతగా సమాధానం చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సదరు తహసీల్దార్ కు మార్చిలోనే ఆ భూమిని ఎవరికి పట్టా చేయొద్దని భాదితులు ఫిర్యాదు చేసినప్పటికి తహసీల్దార్ అవేమి పట్టించుకోకుండా పట్టా జారీచేయడం గమనార్హం
ఏదేమైనా, కోర్టు పరిధిలో ఉన్న భూమికి పట్టాలు మార్చేసిన ఈ వ్యవహారం ఇప్పుడు హన్మకొండ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది








