●675 అమరవీరుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలి
●250 గజాల ఇళ్ల స్థలం, సంక్షేమ బోర్డు కోసం పట్టు
●పోలీస్ శాఖ రికార్డు ప్రకారం కేసులు ఉన్న వారికి కూడా న్యాయం చేయాలి
●తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు డిమాండ్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి హర్షం వ్యక్తం చేసింది.కె. కేశవరావు చైర్మన్గా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించడం శుభపరిణామమని TRUS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు అన్నారు.ఈ కమిటీలో ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రాములు నాయక్ వంటి నేతలను చేర్చడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అమరవీరుల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత
ఈ సందర్భంగా గుర్రం రఘు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 1200 మంది అమరవీరులలో కేవలం 525 మందికి మాత్రమే సహాయం అందించిందని గుర్తు చేశారు. మిగిలిన 675 మంది అమరవీరుల కుటుంబాలకు ప్రస్తుత ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా ఆర్థిక సాయం అందించాలని కోరారు. రెండో ప్రాధాన్యతగా ఉద్యమంలో అంగవైకల్యం చెందిన వారికి, మూడో ప్రాధాన్యతగా జైలుకు వెళ్లిన వారికి సంక్షేమ ఫలాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉద్యమ సమయంలో పోలీస్ రికార్డుల్లో ఉన్న డేటాను సేకరించి, కేసులపాలైన ప్రతి ఉద్యమకారుడిని కూడా ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రూ.1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఉద్యమకారుల బతుకుదెరువు దుర్భరంగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే రూ. 1000 కోట్లతో సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.దీని ద్వారానే ఉద్యమకారులకు పెన్షన్ లు, వైద్యం లాంటివి కల్పించాలని కోరారు. లేనిపక్షంలో బెంగాల్ ఉద్యమకారుల తరహాలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని గుర్రం రఘు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.








