- ఒక్కో ఉద్యోగి ₹500 ‘ఫోన్ పే’ చేయాలంటూ వాట్సాప్ గ్రూపులో హుకుం!
- నేటితో ముగియనున్న గడువు.. DME కి ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగుల సిద్ధం
Hanmakonda TB Hospital | నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన హన్మకొండలోని ప్రభుత్వ టీబీ ఆసుపత్రి (Tuberculosis Hospital) అవినీతికి అడ్డాగా మారుతోంది. ఆసుపత్రిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారే స్వయంగా వసూళ్ల పర్వానికి తెరలేపడం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా జరగాల్సిన ఉద్యోగుల సర్వీస్ రికార్డ్ (SR) డిజిటలైజేషన్ ప్రక్రియను సదరు సూపరింటెండెంట్ తన కాసుల కక్కుర్తికి వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వాట్సాప్ గ్రూపులో ‘ఫోన్ పే’ హుకుం!
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వీస్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియకు ఈరోజే (ఆదివారం) ఆఖరి గడువు కావడంతో, ఆసుపత్రి సూపరింటెండెంట్ దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్కెచ్ వేశారు. ఆసుపత్రి ఉద్యోగుల అధికారిక వాట్సాప్ గ్రూపులోనే బహిరంగంగా వసూళ్ల మెసేజ్ పెట్టడం సంచలనంగా మారింది. ఒక్కో ఉద్యోగి తక్షణమే రూ. 500 చొప్పున ఫోన్ పే (PhonePe) లేదా గూగుల్ పే (GooglePay) చేయాలంటూ సదరు అధికారి ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ పనికి ఉద్యోగుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయడమేంటని సిబ్బంది లోలోపల మండిపడుతున్నారు.
తిరగబడుతున్న ఉద్యోగులు.. DME కి ఫిర్యాదు!
అధికార గర్వంతో వాట్సాప్ గ్రూపుల్లోనే మెసేజ్లు పెడుతూ వేధింపులకు గురిచేస్తుండటంతో ఆసుపత్రి సిబ్బంది ఇక సహించేది లేదంటూ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఉన్నతాధికారి అక్రమ వసూళ్ల బాగోతాన్ని, అందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను సాక్ష్యాలతో సహా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు, సిబ్బంది సమాయత్తమవుతున్నారు.
గడువు ముగుస్తున్న తరుణంలో ఉద్యోగులను ఒత్తిడికి గురిచేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్న ఈ ‘డిజిటల్’ అవినీతి తిమింగలంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.








