New Railway projects : తెలంగాణ (Telangana)లో రైల్వే వ్యవస్థ అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. మరికొన్ని కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి రాబోతున్నాయి. మరిన్ని సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. రైల్వే (Railway) రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం, ఎలక్ట్రీఫికేషన్, స్టేషన్ల ఆధునికీకరణ, వేగంగా నడిచే రైళ్ల కోసం ట్రాక్ల అప్గ్రేడ్ చేయడం తదితర పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా నమో భారత్ (Namo Bharat), అమృత్ భారత్ (Amrit Bharat) రైళ్లను త్వరలో ప్రారంభించనున్నారు. వీటన్నిటికీ కేంద్రం కొత్తగా రూ.5,337 కోట్లు కేటాయించింది.
తెలంగాణలో భారీగా పెట్టుబడులు (Railway projects in telangana )
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం రైల్వే నెట్వర్క్ ఇప్పటికే వంద శాతం విద్యుదీకృతమైంది. దీనికి రూ. 41,677 కోట్ల భారీ పెట్టుబడి పెట్టారు. ఈ ప్రాజెక్ట్తో రాష్ట్రంలో రైళ్ల వేగం పెరుగుతుంది. ఇంధన వినియోగం తగ్గుతుంది. అలాగే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. విద్యుదీకరణ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలోని రైల్వే నెట్వర్క్ మరింత సమర్థంగా మారనుంది. ఈ దశాబ్దంలో రైల్వే అనుసంధానానికి ఇది పెద్ద మైలురాయి. తద్వారా పారిశ్రామిక ప్రాంతాలు, ప్రధాన నగరాలు, పోర్టుల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్, రామగుండం వంటి ప్రముఖ పట్టణాలకు పెద్ద మదుపు లభించనుంది. ఈ మార్పులు వ్యాపార రంగానికి, పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు దోహదపడతాయి. ఈ ప్రభావం వాణిజ్యపరంగా, ప్రయాణికులకు లాభసాటిగా మారుతుంది.
రైళ్ల భద్రతకు కొత్త వలయం
రైల్వే భద్రత(Railway safety)ను పెంచేందుకు కవచ్ (Kavach) టెక్నాలజీ ప్రాజెక్ట్ తెలంగాణలో ముందంజలో ఉంది. 1,465 కిలోమీటర్ల మేర ఈ సాంకేతికత ఇప్పటికే అమలులో ఉంది. మరిప్పుడు సరికొత్త కవచ్ 4.0 వెర్షన్కు సంబంధించిన ప్రయోగాలు కొనసాగుతున్నాయి. దీనిని మరిన్ని 1,326 కిలోమీటర్ల మార్గాల్లో త్వరలో అమలు చేయనున్నారు. వచ్చే ఆరేళ్లల్లో దేశవ్యాప్తంగా ఈ సాంకేతికతను విస్తరించాలన్నది రైల్వే శాఖ లక్ష్యం. రైళ్లు ఢీకొనకుండా ఈ టెక్నాలజీ భద్రతను పెంచుతుంది. ముఖ్యంగా హైస్పీడ్ రైళ్లలో కవచ్ వ్యవస్థ ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది.
కొత్తగా నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు
రైల్వే శాఖ తాజాగా ప్రకటించిన ప్రణాళికల్లో అత్యంత ప్రధానమైనవి నమో భారత్(Namo Bharat), అమృత్ భారత్ రైళ్లు (Amrut Bharat Rails).. ఇప్పటికే తెలంగాణలో ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లు మొత్తం ఏడు జిల్లాలను కలుపుతూ తొమ్మిది ప్రధాన స్టేషన్లలో ఆగుతున్నాయి. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆధునీకరించబడుతున్నాయి. కొత్తగా 50 నమో భారత్ రైళ్లు, 200 వందే భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందిస్తాయి.
వేగవంతమైన రైళ్లకు కీలక ప్రణాళిక
రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 7,000 కిలోమీటర్ల మేర పాత ట్రాక్లను మార్చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాముఖ్యత గల మార్గాల్లో రైళ్ల గరిష్ట వేగాన్ని 160 కి.మీ. వరకు పెంచేలా మార్పులు జరుగుతున్నాయి. కొన్ని మార్గాల్లో 130 కి.మీ. వేగంతో రైళ్లు నడిచేలా ఆధునికీకరిస్తున్నారు. మొత్తం నెట్వర్క్లో కనీసం 100 కి.మీ. వేగంతో రైళ్లు నడిపేలా మార్పులు చేయనున్నారు. ఈ మార్పులు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చే దిశగా దోహదం చేయనున్నాయి.
ప్రారంభానికి సిద్ధంగా రెండో దశ MMTS
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ తెలంగాణలో గత కొన్నేళ్లుగా రైల్వే నిధుల కేటాయింపులో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోందన్నారు. MMTS (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) రెండో దశ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. త్వరలో ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ (MMTS Railway projects) హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతో పాటు ప్రజలకు ఆర్థికంగా లాభసాటి ప్రయాణ అవకాశాలను అందించనున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణకు భారీ ప్రయోజనాలు
భారీగా నిధులను కేటాయించడం, కొత్త ప్రాజెక్టుల (New Railway Projects) ను ప్రవేశపెట్టడం వల్ల తెలంగాణలో రైల్వే వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు తెరతీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక ప్రగతి వేగవంతం అవుతుంది. ప్రయాణ సమయం తగ్గి ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయి.
సరుకుల రవాణా వ్యవస్థ మరింత వేగవంతంగా మారుతుంది. నవీన రైల్వే మౌలిక సదుపాయాలతో మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు, కవచ్ భద్రతా వ్యవస్థ, MMTS విస్తరణ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర రైల్వే రంగానికి కొత్త వెలుగులు తెచ్చే అవకాశమున్నాయని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








