- పూర్తిగా ధ్వసంమైన ప్రగతి ఇండస్ట్రియల్ ఏరియా – రెడ్డిపాలెం రహదారి
- ఇదే రోడ్డుపై ఇన్ఫాంట్ జీసస్, విద్యానిలయ స్కూళ్లు
- నిత్యం స్కూల్ బస్సుల్లో వందలాది విద్యార్థులు.. భయం గుప్పిట్లో ప్రయాణం
- ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా జీడబ్ల్యూఎంసీ నిశ్శబ్దం.. తల్లిదండ్రుల్లో ఆగ్రహం
- “కమిషనర్ చాహత్ బాజ్ పేయి స్పందించాలని వేడుకోలు
Dangerous Roads in Warangal | ఇటీవల చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఆ దృశ్యం చూసి ప్రజలంతా షాక్కు గురై ఇప్పటికీ తేరుకోలేదు.. అయితే ఆ ప్రమాదం తీవ్రతను తలపించేలా మరో అత్యంత ప్రమాదకరమైన రహదారి ఇప్పుడు వరంగల్లో ఉందంటే మీరు నమ్మగలరా? గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రగతి ఇండస్ట్రియల్ ఏరియా- రెడ్డిపాలెం రోడ్డు.. ఇప్పుడు ఇది ప్రమాదాల బాటగా మారింది. పుస్తకాల బరువుతో కాదు, రోడ్డు భయంతో స్కూళ్లకు వెళ్తున్న చిన్నారుల పరిస్థితి.. తల్లిదండ్రుల గుండెల్లో వణుకులు పుట్టిస్తోంది. కమిషనర్ మేడం కనికరించండి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
కమిషనర్ మేడం మమ్మల్ని కాస్త కనికరించండి.. అది స్కూళ్లకు వెళ్లే దారిలా లేదు, నరకానికి వెళ్లే మార్గంలా ఉంది. మేం పుస్తకాల బరువుతో కాదు.. ఈ రోడ్డు (Dangerous Roads ) తో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో స్కూళ్లకు వెళ్తున్నామంటున్నారు రెండు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ రెడ్డిపాలెం సమీపంలో ఉన్న “ఇన్ఫాంట్ జీసస్ కాన్వెంట్ హైస్కూల్ (Infant Jesus convent high school), “విద్యానిలయ(vidhyanilaya)” ప్రైవేట్ స్కూల్లకు వెళ్లే విద్యార్థులు ప్రతీ రోజు గుండెలను అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నట్టు ఫీలవుతున్నారు. వర్షం పడినడపుడు పరిస్థితాఇ మరింత భయానకంగా మారుతుంది. కొంత మంది వాహనదారులు ఈ గుంతలను చూసి భయంతో యూటర్న్ తీసుకుంటున్నారు. భారీ గుంతలతో ఇది “రోడ్డు కాదది, భయానికి మార్గం అయిపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
స్థానికులు చెబుతున్నదేమిటంటే — “ఈ రహదారి పరిస్థితి గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేశామో లెక్కే లేదు. కానీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం నిశ్శబ్దం వహిస్తున్నారు. ఎవరైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తర్వాతే కదులుతారా?” అని ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పేయి ఈ సమస్యపై స్పందిస్తారనే ఆశతో తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. చిన్నారుల భవిష్యత్తు కోసం అయినా ఇప్పటికైనా ఈ రోడ్డును సరిచేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







