●తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు: వారసత్వ భూమి పట్టా కోసం డిమాండ్!
అసలేం జరిగిందంటే?
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మధిర గ్రామానికి చెందిన లోల్లాటి రాజు అనే వ్యక్తి, తన తండ్రి నర్సయ్య మరణానంతరం ఆయన పేరు మీద ఉన్న 27 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చుకోవాలని (వారసత్వ నమోదు) దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ ఫైల్ను క్లియర్ చేసి పట్టా ఇచ్చేందుకు సంబంధిత ఆర్ఐ రూ. 10 వేల లంచం డిమాండ్ చేశారు.
పక్కా ప్లాన్తో పట్టుకున్న అధికారులు
లంచం ఇవ్వడం ఇష్టం లేని రాజు, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలోనే రాజు నుంచి ఆర్ఐ లంచం తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేసి, ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఆర్ఐ వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, కార్యాలయంలోని పలు కీలక రికార్డులను, పత్రాలను సీజ్ చేశారు.
కార్యాలయంలో కలకలం
ఈ ఆకస్మిక దాడితో దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.








