- అవినీతిపై సీఎం విజయ్ ‘సమరం’:
- అవినీతి రహిత పాలనే లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వ సంచలన నిర్ణయం
- నేరుగా ప్రజల నుంచే సమాచార సేకరణ.. ప్రత్యేక హెల్ప్లైన్, పోర్టల్ ఏర్పాటు
CM Joseph Vijay Anti Corruption Campaign | తమిళనాడులో అవినీతిని అంతమొందించడమే ధ్యేయంగా నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో లంచగొండితనానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా, ఏ అధికారి అయినా చిన్న మొత్తంలో.. అంటే కేవలం రూ. 1,000 లంచం అడిగినా సరే, ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సీఎం విజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలా నిజాయితీతో కూడిన సమాచారం అందించి, అవినీతి తిమింగలాలను పట్టుకోవడంలో సహకరించిన పౌరులకు ప్రభుత్వం తరఫున రూ. 1 లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు.
ప్రజల నుంచే నేరుగా సమాచారం!
పాలనలో పారదర్శకత పెంచేందుకు అవినీతి అధికారుల గురించిన పూర్తి వివరాలను ప్రభుత్వం నేరుగా ప్రజల నుంచే సేకరించనుంది. తప్పు చేసిన వారు ఎంతటివారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ విషయంలో రాజీపడేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ విభాగాల్లో ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో సహా పెకలించివేసేందుకే ఈ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రత్యేక హెల్ప్లైన్, ఆన్లైన్ పోర్టల్..
- ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు మరియు ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించుతోంది.
- ప్రజలు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఒక టోల్ ఫ్రీ నంబర్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
- లంచం డిమాండ్ చేస్తున్న అధికారులకు సంబంధించిన ఆడియో, వీడియో లేదా డాక్యుమెంట్ల ఆధారాలను నేరుగా అప్లోడ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ను రూపొందిస్తున్నారు.
- అందిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిశీలించి, సదరు అవినీతి అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకునేలా ఒక ప్రత్యేక విభాగాన్ని (టాస్క్ఫోర్స్) రంగంలోకి దించనున్నారు.
ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతాం!
“అవినీతిపై సమాచారం ఇచ్చే ప్రజల వివరాలు మరియు వారి ఐడెంటిటీని అత్యంత గోప్యంగా ఉంచుతాం. ప్రజలు ఎటువంటి భయం లేకుండా ముందుకొచ్చి అవినీతి రహిత తమిళనాడు నిర్మాణంలో భాగస్వాములు కావాలి” అని సీఎం విజయ్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అవినీతిపై విజయ్ తీసుకున్న ఈ భారీ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లంచగొండి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా, సామాన్య ప్రజల నుంచి మాత్రం ఈ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.








