- కబ్జా దారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారి
- మంగళవారం హద్దులు కేటాయించిన అధికారులు
Housing Board Land Survey | ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే.. ప్రభుత్వ భూమిపై కన్నేస్తే సహించేది లేదని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద (Warangal Collector Satya Sharada) చేతల్లో చూపిస్తున్నారు. దశాబ్దాలుగా ఆక్రమణల చెరలో చిక్కుకున్న, కబ్జాదారుల కన్ను పడ్డ విలువైన హౌజింగ్ బోర్డు భూములను రక్షించి జిల్లా వాసుల నీరాజనాలు అందుకుంటున్నారు.
మంగళవారం: ఆక్రమణదారులకు ‘అమంగళం’
గత కొంతకాలంగా వివాదస్పదంగా మారిన కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములను కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించారు. కలెక్టర్ సత్య శారద సీరియస్ గా తీసుకోవడంతో అటు కొంతమంది అధికారులు, ఇటు కబ్జాదారులు ఆటలు సాగలేదు.
వేగవంతమైన నిర్ణయం: వరంగల్ జిల్లా గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని సర్కార్ లైవ్ వరుస కథనాలను వెలువరించిన నేపథ్యంలో ఆ భూములపై సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయమని జిల్లా కలెక్టర్ వేగవంతమైన ఆదేశాలు జారీ చేయడంతో గత 10 రోజులుగా సర్వే చేసిన అధికారులు మంగళవారం హద్దులు ఏర్పాటు చేశారు.
కబ్జాదారుల వెన్నులో వణుకు..
రాజకీయ పలుకుబడితోనో, ధనబలంతోనో భూములను కాజేయాలనుకున్న కబ్జాదారుల గుండెల్లో ఇప్పుడు కలెక్టర్ పేరు వింటేనే రైళ్లు పరిగెడుతున్నాయి. “నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదు” అన్న ఆమె హెచ్చరికలు జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి. కలెక్టర్ తీసుకుంటున్న ఈ సాహసోపేతమైన చర్యల పట్ల సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల భాగ్యం.. సత్య శారద గారి పాలన!
”వరంగల్ జిల్లాకు ఇలాంటి నిజాయితీ గల అధికారి రావడం మా అదృష్టం” అని జిల్లా వాసులు కొనియాడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే కాకుండా, పారదర్శకమైన పాలన అందిస్తున్న ఆమెపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది.
”భూమి ఏదైనా.. అది ప్రభుత్వానికి చెందితే ప్రజల ఆస్తి. దానిని కాపాడటం నా బాధ్యత అన్నట్లుగా ఆమె పనిచేస్తున్నారు.ఈ చర్యలతో వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లభించడమే కాకుండా, భవిష్యత్తులో భూకబ్జాలకు పాల్పడాలనుకునే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లయింది.








