అవినీతి అధికారుల వేటలో తెలంగాణ ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక అధికారి, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. పనులు పూర్తి చేసినా, బిల్లులు ఆపేసి వేధిస్తున్న తీరుపై విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే..?
హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ తుపాను నీటి కాలువ (Storm Water Drain) నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించిన మెజర్మెంట్ బుక్ (M-Book) లో వివరాలు నమోదు చేసి, ఫైనల్ బిల్లును ప్రాసెస్ చేయాల్సి ఉండగా.. అసిస్టెంట్ ఇంజనీర్ (AE) నుసుం సుధాకర్ రెడ్డి చక్రం తిప్పాడు. పని పూర్తి చేసినందుకు ‘ఆఫీస్ ఫేవర్’ కింద రూ. 50,000 లంచం ఇవ్వాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సీన్!
హుజూరాబాద్లోని ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సదరు కాంట్రాక్టర్ నుంచి రూ. 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. సుధాకర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, ఆయన చేతిలో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
అవినీతిపై ఫిర్యాదు చేయండి: ఏసీబీ (ACB )
ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
సంప్రదించాల్సిన వివరాలు:
- టోల్ ఫ్రీ నెంబర్: 1064
- వాట్సాప్: 9440446106
- ఫేస్ బుక్: Telangana ACB
- ఎక్స్ (Twitter): @TelanganaACB
- వెబ్ సైట్: acb.telangana.gov.in
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి.








