- రైతులకు నష్టం.. మిల్లర్లకు లాభం
- ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువుదోపిడీ
- మిల్లర్లతో కుమ్మక్కైన నిర్వాహకులు, అధికారులు
- పట్టించుకోని యంత్రాంగం.. కన్నీరు పెడుతున్న అన్నదాత
Paddy Procurement Scam | ఆరుగాలం శ్రమించి, చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే అన్నదాతకు గుండెకోత మిగులుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (ఐకేపీ/పీఏసీఎస్) అడుగడుగునా దోపిడీ సాగుతోంది. “ధాన్యంలో కోత.. అధికారులకు మేత” అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటాలుకు 40.700 కిలోల చొప్పున తూకం వేయాల్సి ఉండగా, తాలు, తరుగు, తేమ పేరుతో మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై రైతు గొంతు కోస్తున్నారు.
క్వింటాలుకు 2 నుండి 5 కిలోల కోత!
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటను కాంటా వేసే సమయంలోనే తరుగు పేరుతో క్వింటాలుకు 2 నుండి 5 కిలోల వరకు అదనంగా తూకం వేస్తున్నారు. నిలదీస్తే “మిల్లుల్లో దించుకోరు.. మీ ఇష్టమొచ్చిన చోట అమ్ముకోండి” అంటూ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తుంది . చేసేదేమీ లేక, తెచ్చిన పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, వర్షాలకు తడిసిపోతుందనే భయంతో రైతులు వారు అడిగినంత కోతకు ఒప్పుకుంటున్నారు. ఫలితంగా ఒక్కో రైతు వేల రూపాయల్లో నష్టపోతుండగా, రైస్ మిల్లర్లు మాత్రం కోట్లు గడిస్తున్నారు.
Paddy Procurement Scam : అధికారుల ‘మామూళ్ల’ పర్వం!
కొనుగోలు కేంద్రాల్లో ఇంత బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు, స్థానిక అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ‘నైవేద్యాల’ కథే నడుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లర్ల నుండి, కేంద్రాల నిర్వాహకుల నుండి అధికారులకు ముందస్తుగానే భారీగా ముడుపులు అందుతున్నాయని, అందుకే వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు చేయాల్సిన అధికారులు ఏసీ గదులకే పరిమితం కావడంతో మిల్లర్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.
”రైతును రక్షించే నాథుడే లేడు”
“రాత్రింబవళ్లు కష్టపడి పంట పండిస్తే.. ఇక్కడ తరుగు పేరుతో క్వింటాలుకు 4 కిలోలు ఎగనామం పెడుతున్నారు. లారీలు రావడం లేదని రోజుల తరబడి కేంద్రాల్లోనే కాపలా కాయాల్సి వస్తోంది. అటు కూలీల ఖర్చులు, ఇటు తరుగు కోతలతో మాకు పెట్టుబడి కూడా దక్కేలా లేదు. అధికారులకు తెలిసినా పట్టించుకునే వారే లేరు.”
— (ఒక బాధిత రైతు ఆవేదన)
తక్షణమే చర్యలు చేపట్టాలి
ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్న మిల్లర్లపై, వారికి సహకరిస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.








