- అటెండర్ టు డీఐ.. సదరు అధికారి ప్రమోషన్లపై గుసగుసలు
- 25 ఏళ్లుగా ఒకే జిల్లాలో తిష్ఠవేసిన డీ ఐ
- రెవెన్యూ గెస్ట్ హౌస్ కేంద్రంగా సెటిల్మెంట్లు?
- ముచర్ల భూముల్లో రైతులపై ప్రతాపం.. బదిలీ ఆపుకునేందుకు పాట్లు
Revenue DI Corruption Survey Numbers Tampering | సదరు అధికారికి ముడుపులు ముడితే చాలు.. వివాదాస్పద భూముల సర్వే నెంబర్లు మారిపోతాయి, రికార్డుల్లో మ్యాపులు తారుమారైపోతాయి! బాధితులు లబోదిబోమన్నా పట్టించుకునే నాథుడే లేడు. అటెండర్ స్థాయి నుంచి జిల్లా ఇన్స్పెక్టర్ (డీఐ) స్థాయికి ఎదిగిన సదరు అధికారి వ్యవహార శైలిపై ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఒకే జిల్లాలో పాతుకుపోయి, బదిలీ రాకుండా చక్రం తిప్పుతున్న ఆ అధికారి లీలలపై ప్రత్యేక కథనం.
ఉద్యోగం చేస్తూ కాలేజీకి ఎప్పుడెళ్లారు?
అటెండర్ ఉద్యోగంతో ప్రస్థానం ప్రారంభించిన సదరు అధికారి, ఆ తర్వాత వరుస ప్రమోషన్లతో డీఐ స్థాయికి చేరడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పదవికి కావాల్సిన అర్హతలు, విద్యార్హతల సాధనపై తోటి ఉద్యోగులే సెటైర్లు వేస్తున్నారు. పగడబందీగా ఉద్యోగం చేసుకుంటూనే, ఆయన ఎప్పుడు కాలేజీకి వెళ్లారు? ఏలా డిగ్రీలు సాధించారనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. సదరు డీ ఐ విద్యార్హతలకు సంబందించిన సర్టిఫికెట్ లపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే అసలు రంగు బయటపడుతుందనే డిమాండ్ వినిపిస్తోంది.
పాతికేళ్లుగా ఒకే చోట తిష్ఠ!
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్లకు ఒకసారి బదిలీలు జరగడం సహజం. కానీ ఈ ‘డీ ఐ ’ కి మాత్రం ఆ నిబంధనలు వర్తించవు కాబోలు! అటెండర్ ఉద్యోగం మొదలు డీ ఐ వరకు గత 25 సంవత్సరాలుగా ఒకే జిల్లాలో పాతుకుపోయిన సదరు అధికారి,స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతో బదిలీల ప్రతిపాదనలు వచ్చిన ప్రతిసారీ వాటిని పక్కన పడేలా చేయడంలో సిద్ధహస్తుడనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా బదిలీ కాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
గెస్ట్ హౌస్ కేంద్రంగా సెటిల్మెంట్లు(Corruption)!
కార్యాలయంలో కంటే స్థానిక రెవెన్యూ గెస్ట్ హౌస్లోనే ఈ డీఐ గారి దర్శనం ఎక్కువగా లభిస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ గెస్ట్ హౌస్ కేంద్రంగానే వివాదాస్పద భూముల సెటిల్మెంట్లు, చేతులు మారే ముడుపుల పర్వాలు సాగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.విధులు కంటే కూడా సదరు డీ ఐ కి రెవెన్యూ గెస్ట్ హౌస్ లోనే ఎక్కువ సమయం గడపడం అలవాటుగా మారిందని మాతృశాఖలో ప్రచారం జరుగుతుంది
ముచర్ల రైతుల ముప్పు తిప్పలు
ముచర్ల ప్రాంతంలో భూములకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో, అక్కడి పేద రైతులను ఈ అధికారి ముప్పు తిప్పలు పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నెంబర్లు మార్చడం, ఉన్న మ్యాపులను తారుమారు చేయడం ద్వారా నిజమైన భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు, రియల్టర్లకు కొమ్ముకాస్తూ పేద రైతుల నోట్లో మట్టి కొడుతున్న ఈ అధికారి అక్రమాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
- ఇంతకీ ఎవరా డి ఐ..?
- అటెండర్ టు డీ ఐ ప్రమోషన్ ల మర్మమేమిటి?
- ఆయన “విద్యార్హతల సర్టిఫికేట్ “ల మాయజాలం ఏంటి..?
- సదరు అధికారి బదిలీ కాకుండా వాడుకునే అస్త్రాలు ఏంటి?
- EXCLUSIVE కథనం…మీ సర్కార్ లైవ్ లో…








