ఆటోలో ప్రయాణించే అమాయక ప్రయాణికులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, బెదిరించి నగదు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను గీసుగొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక ఆటో, 5 సెల్ఫోన్లు మరియు రూ.15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్ గీసుగొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ఘటన నేపథ్యం..
ఈ నెల 3వ తేదీన నమోదైన ఫిర్యాదు ప్రకారం.. ఏప్రిల్ 30న వరంగల్కు చెందిన విద్యార్థి పెరుమాండ్ల సిద్ధార్థ తన స్నేహితుడితో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లేందుకు కోటగండి మైసమ్మ వద్ద ఆటో కోసం వేచి ఉన్నాడు. ఆటో డ్రైవర్ సాయికుమార్ తన ముఠాతో కలిసి, గిర్నీబావి వద్ద దింపుతామని నమ్మించి వారిని ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం గంగాదేవిపల్లి గ్రామ శ్మశాన వాటిక సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, సిద్ధార్థ వద్ద ఉన్న రూ.70,000 కాలేజీ ఫీజును బలవంతంగా లాక్కొని పరారయ్యారు.
నిందితుల వివరాలు
అరెస్టయిన వారిలో ప్రధాన సూత్రధారి మార్త సాయికుమార్ (నర్సంపేట రౌడీ షీటర్)తో పాటు పెరుమాండ్ల బాలాజీ, మేకల ప్రేమంత్ కుమార్, పిట్టల సందీప్, నీలం అఖిల్ మరియు ఒక మైనర్ (కొలుగూరి వికాస్) ఉన్నారు. వీరిలో ముగ్గురు నిందితులపై గతంలోనే పలు దొంగతనం, రాబరీ కేసులు నమోదై ఉన్నాయి. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
పోలీసుల చాకచక్యం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో గీసుగొండ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం ఊకల్ క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.
నిందితులను తక్కువ సమయంలో పట్టుకుని కేసును ఛేదించిన గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, అనిల్ కుమార్ మరియు సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు








