- 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి భారీగా ధాన్యం గోల్ మాల్
- సుమారు 10 ఏసికేలకు పైగా ప్రభుత్వ వడ్లు గల్లంతైనట్లు ఆరోపణలు
Punnel Village Rice Mill Fraud : ”నిబంధనలు నాకు వర్తించవు.. నా ఇష్టారాజ్యమే ఇక్కడ శాసనం” అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ఫున్నేల్లోని సత్యనారాయణ స్వామి రైస్ మిల్లు యజమాని. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వ ధాన్యం సేకరణలో భారీ గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ ప్రభుత్వానికి చెందిన వడ్లు మాయమవ్వడం ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది.
ఏకంగా 10 ఏసీకేలకు పైగా (ACKs) వడ్లు గల్లంతు!
ప్రభుత్వ లెక్కల ప్రకారం సివిల్ సప్లైస్ విభాగం నుంచి మిల్లుకు అప్పగించిన ధాన్యంలో భారీ తేడాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 10 ఏసీకేలకు (Ack) సంబంధించిన వడ్లు మిల్లు నుండి ‘మాయం’ అయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం విలువ మార్కెట్ ధర ప్రకారం కోటికి పైగా ఉంటుందని అంచనా.
గోల్మాల్ వెనుక గుట్టు ఇదేనా?
ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న తరుణంలో, నిల్వల లెక్కలు తేల్చాల్సి ఉండగా.. సదరు మిల్లర్ చేతివాటం ప్రదర్శించినట్లు రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.మిల్లులో ఉండాల్సిన ప్రభుత్వ వడ్లను ప్రైవేట్ మార్కెట్కు మళ్లించారా? కాగితాల్లో నిల్వలు చూపిస్తున్నట్లు, మిల్లులో పూర్తి స్థాయిలో ధాన్యo ఉందా అనేది అనుమానమే. ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం గల్లంతైనట్లు ఆరోపణలు వస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఉన్నతాధికారులు స్పందిస్తారా?
”నా మిల్లు.. నా ఇష్టం” అన్న ధోరణిలో ఉన్న మిల్లర్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పేద రైతుల శ్రమను, ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 10 ఏసీకేల వడ్లు ఎక్కడికి వెళ్లాయో తేల్చడానికి విచారణ కమిటీని రంగంలోకి దించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ ‘ధాన్యం’ దందాను అరికట్టే సాహసం అధికారులు చేస్తారా? లేక సత్యనారాయణ స్వామి మిల్లర్ ‘ఇష్టారాజ్యం’ ఇలాగే కొనసాగుతుందా? వేచి చూడాలి.








