రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్లైన్ ట్రక్ షీట్’ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే ఈ విధానాన్ని ఎత్తివేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఏమిటీ సమస్య?
సాధారణంగా రైతులు ఐకేపీ (IKP) సెంటర్లకు ధాన్యం తెచ్చినప్పుడు, గతంలో మాన్యువల్ పద్ధతిలో తూకం వేసి వెంటనే రశీదులు ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం అమలు చేస్తున్న ఆన్లైన్ ట్రక్ షీట్ విధానంలో సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారాయి.ప్రధానంగా సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.ఆన్లైన్ పోర్టల్ తరచూ మొరాయించడం వల్ల ట్రక్ షీట్లు జనరేట్ కావడానికి గంటల సమయం పట్టే అవకాశం ఉంది.అలాగే రవాణాలో కూడా జాప్యం జరిగే అవకాశం ఉంది.ట్రక్ షీట్ వస్తే తప్ప లారీలకు అనుమతి లభించని పరిస్థితి నెలకొంది.దీనివల్ల ధాన్యం బస్తాలు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ఎండకు ఎండి, వానకు తడిచే ప్రమాదం ఉంది.ధాన్యంతోపాటే రైతులు పొద్దంతా ఎండలో ఉండి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు.ఆన్లైన్ ప్రక్రియలో చిన్నపాటి తేడాలు వచ్చినా మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేసుకోవడానికి నిరాకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాత విధానమే మేలు..
”కొత్త టెక్నాలజీ పేరుతో మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు” అని పలువురు రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. గతంలో ఉన్న మాన్యువల్ విధానం వల్ల పారదర్శకత ఉండటమే కాకుండా, తూకం వేయగానే రైతుకు భరోసా లభించేదని వారు గుర్తు చేస్తున్నారు.
”రైతులకు సాంకేతికతపై పూర్తి అవగాహన ఉండదు. ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యమైతే ధాన్యం బరువు తగ్గి మాకు నష్టం వస్తుంది. ప్రభుత్వం స్పందించి వెంటనే పాత విధానాన్ని అమలు చేయాలి.”
— హన్మకొండ జిల్లాలో ఓ రైతు ఆవేదన
ప్రభుత్వానికి రైతుల విన్నపం..
కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఈ ఆన్లైన్ అడ్డంకులను తొలగించాలని రైతులు కోరుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో, ధాన్యం సేకరణ వేగవంతం కాకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందించి, ధాన్యం కొనుగోళ్లలో ఉన్న ప్రతిష్టంభనను తొలగిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ యాసంగి సీజన్ కు పాత విధానాన్నే కొనసాగించి వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి ఆన్లైన్ ట్రక్ షీట్ విధానాన్నే కొనసాగించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పాత విధానం Vs కొత్త విధానం
| అంశం | పాత (మాన్యువల్) విధానం | కొత్త (ఆన్లైన్) విధానం |
| తూకం వేయడం | వెంటనే తూకం వేసి రశీదు ఇచ్చేవారు. | ఆన్లైన్ ఎంట్రీ అయ్యే వరకు నిరీక్షణ. |
| రవాణా | తూకం పూర్తవగానే లారీ లోడింగ్. | ట్రక్ షీట్ వస్తేనే లారీ కదులుతుంది. |
| సాంకేతికత | ఎటువంటి సర్వర్ సమస్యలు ఉండవు. | సర్వర్ డౌన్ అయితే కొనుగోళ్లు బంద్. |
| రైతు భరోసా | తూకం వేయగానే రైతుకు భరోసా. | అన్లోడ్ అయ్యే వరకు టెన్షన్. |
జిపిఎస్(GPS)లొల్లి..
హన్మకొండ జిల్లాలో ధాన్యాన్ని ఎక్కువ శాతం రైతులే తమ సొంత ట్రాక్టర్ ల ద్వారా మిల్లులకు తరలిస్తుంటారు.ధాన్యం రవాణా చేసే లారీల మాదిరిగానే ట్రాక్టర్ లకు జిపిఎస్ ట్రాకర్ అమర్చడం సాధ్యం కాదని, ఒక్కో రైతు తమ పంటను తీసుకెళ్లడానికి సొంత ట్రాక్టర్ కు జిపిఎస్ ట్రాకర్ అమర్చుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని రైతులు ఆవేదన చెందుతున్నారు. కావున పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి రైతుల ట్రాక్టర్ లకు జిపిఎస్ అమర్చే విధానాన్ని ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








